గాలివాన బీభత్సం
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:16 AM
Heavy rain accompanied by thunder and lightning జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. శుక్రవారం ఉదయం నుంచి మధాహ్నం వరకు ఎండ తీవ్రతతో ప్రజలు అవస్థలు పడ్డారు.
ఉరుములు మెరుపులతో భారీ వర్షం
గాలుల తీవ్రతకు కూలిన చెట్లు
విద్యుత్ సరఫరాకు అంతరాయం
మెళియాపుట్టి/ పాతపట్నం/ పాతపట్నం రూరల్/ నరసన్నపేట/ అరసవల్లి, జూన్ 12(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. శుక్రవారం ఉదయం నుంచి మధాహ్నం వరకు ఎండ తీవ్రతతో ప్రజలు అవస్థలు పడ్డారు. సాయంత్రం శ్రీకాకుళం, మెళియాపుట్టి, పాతపట్నం, నరసన్నపేట, ఎచ్చెర్ల తదితర మండలాల్లో వర్షం కురవడంతో ఉపశమనం పొందారు. కాగా.. శ్రీకాకుళంలోని డేఅండ్ నైట్ జంక్షన్ నుంచి రైతుబజార్కు వెళ్లే రహదారి జలమయమైంది. నరసన్నపేటలో కూడా రహదారులపై వర్షం నీరు ప్రవహించడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
ఈదురుగాలలు తీవ్రతకు మెళియాపుట్టి మండలంలో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం నెలకొంది. పాతపట్నం నుంచి మెళియాపుట్టి సబ్స్టేషన్ వచ్చే లైన్ల వైర్లు తెగిపోవడంతో రాత్రికి విద్యుత్ వచ్చే పరిస్థితి లేదని అధికారులు తెలిపారు. మెళియాపుట్టిలోని ఐకేపీ, పాత తహసీల్దార్ కార్యాలయాల వద్ద కూడా విద్యుత్ వైర్లు దెబ్బతిని.. ట్రాన్స్ఫార్మర్లో మంటలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందారు. మెళియాపుట్టి - టెక్కలి రోడ్డులోని మర్రిపాడు వద్ద చెట్లు నేలకొరిగాయి. ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. పాతపట్నం మండలంలో పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగి.. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
కొబ్బరిచెట్టుపై పిడుగు
పాతపట్నం మండలంలో శుక్రవారం ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. సాయంత్రం 4 గంటల సమయంలో ప్రహరాజపాలెంలోని రావాడ సోమేష్ ఇంటి పెరటిలో కొబ్బరిచెట్టుపై పిడుగు పడింది. పచ్చని చెట్టుపై అగ్గిమంట రాజుకుంది. పిడుగు శబ్దానికి హడలిపోయాయని, ఆ సమయంలో కొబ్బరిచెట్టు సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని సోమేష్ తెలిపాడు.