గాలి, వాన బీభత్సం
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:19 AM
Heavy rain in srikakulam జిల్లాను అకాల వర్షం వణికించింది. శుక్రవారం రాత్రి రాత్రి 9.30 గంటల సమయంలో జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది.
వడగళ్లు, పిడుగుల మోత
పలుచోట్ల నేలకూలిన వృక్షాలు
మామిడి, జీడి, అరటి రైతులకు అపార నష్టం
జిల్లా కేంద్రం, పలు గ్రామాల్లో అంఽధకారం
అత్యధికంగా కంచిలిలో 22.5 మిమీల నమోదు
శ్రీకాకుళం, మార్చి 20(ఆంధ్రజ్యోతి) : జిల్లాను అకాల వర్షం వణికించింది. శుక్రవారం రాత్రి రాత్రి 9.30 గంటల సమయంలో జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. కంచిలి మండలంలో అత్యధికంగాను.. మెళియాపుట్టి మండలంలో అత్యల్పంగా వర్షపాతం నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. ఈదురుగాలులు మాత్రం విధ్వంసం సృష్టించాయి. ఉరుములు, మెరుపులతోపాటు పలుచోట్ల పిడుగులు పడటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వడగళ్ల వాన, బలమైన గాలుల ధాటికి పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. కరెంటు తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి, జిల్లా కేంద్రంతోపాటు పలు గ్రామాలు అంధకారంలో మగ్గిపోయాయి. మరోవైపు ఈ అకాల వర్షం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. ఈదురు గాలులు, వడగళ్ల దెబ్బకు మామిడి, జీడిమామిడి, అరటి తదితర ఉద్యానవన పంటలకు పలుచోట్ల అపార నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంట కళ్లెదుటే నేలపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శుక్రవారం నమోదైన వర్షపాతం (మిల్లీమీటర్లలో)
================
మండలం వర్షపాతం
====================
కంచిలి 22.5
ఇచ్ఛాపురం 20.0
ఆమదాలవలస 16.5
రణస్థలం 15.5
శ్రీకాకుళం 14.75
లావేరు 11.25
ఎచ్చెర్ల 10.75
జి.సిగడాం 10.0
సరబుజ్జిలి 9.0
జలుమూరు 5.0
గార 4.25
భూర్జ 2.75
హిరమండలం 1.25
మెళియాపుట్టి 1.25