ఒడిశా టు గుజరాత్
ABN , Publish Date - Jul 30 , 2026 | 01:08 AM
ఒడిశా నుంచి గుజరాత్ రాష్ట్రానికి తరలిస్తున్న గంజాయిని ఇచ్ఛాపురం పోలీసులు పట్టుకున్నారు.
34.2 కిలోల గంజాయి స్వాధీనం
ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు
ఇచ్ఛాపురం, జూలై 29(ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి గుజరాత్ రాష్ట్రానికి తరలిస్తున్న గంజాయిని ఇచ్ఛాపురం పోలీసులు పట్టుకున్నారు. బుధవారం సర్కిల్ కార్యా లయంలో సీఐ మీసాల చిన్నమనాయుడు ఈ వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన అనిల్కుమార్గౌడో (34), మున్నా ప్రధాన్(24) గంజాయి వ్యాపారం చేసే ఒడిశాలోని బహరగుడాకు చెందిన కుంజో జనాకు కలిసారు. తాను చెప్పినట్లు గంజాయిని తరలిస్తే ప్రతిసారీ రూ.10వేలు ఇ స్తానని కుంజోజనా చెప్పటంతో దానికి ఇ ద్దరూ ఒప్పుకున్నారు. గుజరాత్ రాష్ట్రం సూరత్ జిల్లా విదిరోడ్ ఏరియాలో ఉంటున్న గంగా మహంతి అనే వ్యక్తికి అప్పగించాలని చెప్పి 34.290 కిలోల గంజాయిని కుంజోజనా వీరికి ఇచ్చాడు. ఇద్దరూ గంజాయిని తీసుకుని బరంపురం రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. అక్కడి నుంచి సూరత్ వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. అయితే రైల్వేస్టేషన్లో పోలీసుల తనిఖీలు ఎక్కువగా ఉండడంతో అక్కడే రెండు రోజుల పాటు ఉండిపోయారు. ఇచ్ఛాఫురం రైల్వేస్టేషన్ మీదుగా గంజాయిని సూరత్కు తరలించేందుకు ప్లాన్ చేసుకుని ఇచ్ఛాపురం వరకు బస్సులో వచ్చి బస్టాండ్లో దిగారు. అక్కడి నుంచి రైలుమార్గం ద్వారా గుజరాత్కు తరలించే క్రమంలో రైల్వేస్టేషన్కు రెండు సూట్కేసులు, లగేజ్ బ్యాగ్తో వచ్చారు. వీరు అనుమానాస్పదంగా కనిపించటంతో పట్టణ ఎస్ఐ ముకుందరావు, పోలీసులు తనిఖీలు చేపట్టగా గంజాయి పట్టుబడింది. వీరిని అరెస్ట్ చేయటంతో పాటు వీరి వద్ద ఉన్న గంజాయిని సీజ్ చేసి రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.