నేడే నీట్
ABN , Publish Date - May 03 , 2026 | 12:03 AM
NEET in four centers దేశవ్యాప్తంగా ఉన్న వైద్యకళాశాలలు, దంత వైద్యకళాశాలు ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయర్వేద వైద్య విద్యకోర్సులు, బీఎస్సీ నర్సింగ్లో ప్రవేశాలకుగానూ ఆదివారం ‘నీట్’ నిర్వహించనున్నారు. జిల్లాలో నాలుగు కేంద్రాల్లో నిర్వహించనున్న ఈ పరీక్షకు 1,951 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
నాలుగు కేంద్రాల్లో పరీక్ష
హాజరుకానున్న 1,951 మంది అభ్యర్థులు..
11 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతి
డ్రెస్కోడ్ తప్పనిసరిగా పాటించాలి
నరసన్నపేట, మే 2(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఉన్న వైద్యకళాశాలలు, దంత వైద్యకళాశాలు ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయర్వేద వైద్య విద్యకోర్సులు, బీఎస్సీ నర్సింగ్లో ప్రవేశాలకుగానూ ఆదివారం ‘నీట్’ నిర్వహించనున్నారు. జిల్లాలో నాలుగు కేంద్రాల్లో నిర్వహించనున్న ఈ పరీక్షకు 1,951 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఈ మేరకు సీసీ కెమెరాల నిఘా నడుమ పకడ్బందీగా పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.
ఎచ్చెర్లలో ఆర్జీయూకేటీ, పాత శ్రీకాకుళంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, శ్రీకాకుళంలో ఆర్ట్స్ కళాశాల(ప్రభుత్వ పురుషుల డిగ్రీ), పెద్దపాడులో కేంద్రీయ విద్యాలయంలో నీట్ నిర్వహిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ).. ఆఫ్లైన్(పేపర్, పెన్) విధానంలో సీసీ కెమెరాల నిఘా నడుమ ఈ పరీక్షలను నిర్వహించనుంది. పరీక్ష కేంద్రాలకు పరిశీలకులను నియమించింది. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. మొబైల్ఫోన్లు, ఎలక్ర్టానిక్ వాచీలు, కాలిక్యూలేటర్లు, పర్సులు, ఎలాంటి మెటాలిక్ వస్తువులను కూడా అనుమతించరు. అడ్మిట్ కార్డు, పాస్పోర్టు సైజు ఫోటో అతికించిన సెల్ప్ డిక్లరేషన్ ఫారం, అటెండెన్స్ షీట్పై అతికించేందుకు పాస్పోర్టు సైజు ఫొటో మరొకటి, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒరిజనల్ గుర్తింపుకార్డు (ఆధార్/ఓటర్ కార్డు / పాన్ కార్డు)ను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. డ్రెస్కోడ్ను విధిగా పాటించాలి. పుల్హ్యాండ్స్ షర్టులు వద్దు, పెద్దబటన్లు ఉన్న దుస్తులు, బూట్లు, చెవిపోగులు, జడ క్లిప్పులు, ఉంగరాలు, గొలుసులు, ముక్కుపుడకలు వంటివి ఉండకూడదు. అలాగే పరీక్షా కేంద్రాలకు సులువుగా చేరుకునేందుకు ప్రజారవాణా సంస్థ.. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బస్సుల సౌకర్యం కల్పించనుంది. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు నిర్వహించనున్నారు.