క్షేమంగానే ఉన్నాం
ABN , Publish Date - Mar 03 , 2026 | 12:21 AM
Migrants in Dubai, Qatar and other places ఇరాన్- ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న బీకర దాడుల నేపథ్యంలో జిల్లాకు చెందిన వలసజీవుల కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
దుబాయ్, ఖతార్ తదితర ప్రాంతాల్లో వలసజీవులు
ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఆందోళన
క్షేమ సమాచారంతో ఊరట
కంచిలి/ హిరమండలం/ నరసన్నపేట, మార్చి 2 (ఆంఽధ్రజ్యోతి): ఇరాన్- ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న బీకర దాడుల నేపథ్యంలో జిల్లాకు చెందిన వలసజీవుల కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉపాధి నిమిత్తం కంచిలి మండలానికి చెందిన పలువురు దుబాయ్, ఖతార్, అబుదబీ, షార్జా వంటి ప్రాంతాలకు కొన్నాళ్ల కిందట వలస వెళ్లారు. ప్రస్తుతం ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో వారి పరి స్థితి ఎలా ఉందోనని స్థానిక కుటుంబ సభ్యులు కలవర పడుతున్నారు. కాగా ఫోన్లో వారిని సంప్ర దించగా.. తామంతా అక్కడ క్షేమంగానే ఉన్నామని చెప్పడంతో కాస్త ఊరట చెందుతున్నారు.
కంచిలి మండలం డీజీ పురం గ్రామానికి చెందిన బంగారి రాకేష్ 9 నెలల కిందట ఖతార్ వెళ్లాడు. ‘ప్రస్తుతం మా ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. బాగానే ఉన్నాం. మిచెల్ ఏదైనా పడే ముందు ఫోన్కు రెడ్ అలర్ట్ వస్తుంది. మేము పనిచేస్తున్న కంపెనీ నుంచి ముందస్తు సమాచారం సైతం పొందుతున్నామ’ని రాకేష్ తెలిపారు.
అదే గ్రామానికి చెందిన దొండియా రాము ఏడాది కిందట షార్జా వెళ్లారు. ఆయన సైతం తమ ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేవని తెలియజేశాడు. కదంబాల అర్జున చౌదరి అబుదాబిలో ఉంటున్నారు. ఆయన కూడా తమ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు లేవని చెప్పారు.
కంచిలికి చెందిన సునీల్ నాయికో ప్రస్తుతం అబుదబీలో ఉంటున్నారు. ‘మా ప్రాంతానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న రసల్కైమా వద్ద మిచైల్ పడింది. దీంతో అక్కడ ఉన్న కంపెనీలను మూసివేశారు. మా కంపెనీ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకపోవడంతో నాలుగు గంటల వరకు పనిచేయించి విడిచిపెట్టార’ని తెలిపారు. వీరితోపాటు అబుదబీలో ఉంటున్న కంచిలి మండల వాసులు ప్రసాంత్ నాయికో, కె.చంద్రశేఖర్, ఖతార్లో ఉంటున్న సావలాం గణేష్ సైతం క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు.
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా.. దుబాయ్లో తాము క్షేమంగానే ఉన్నామని హిరమండలం మండలం కోరాడ ఆర్ఆర్ కాలనీకి చెందిన దున్న యాదవరావు.. ‘ఆంధ్రజ్యోతి’కి ఫోన్లో తెలిపారు. ‘అబుదబి నుంచి మేము ఉంటున్న ప్రాంతానికి మూడు గంటల ప్రయాణం ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో మాత్రమే దాడులు జరుగుతున్నాయి. మేము ఉంటున్న ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బంది లేదు. విధులకు కూడా వెళ్తున్నాన’ని యాదవరావు తెలిపారు.
ఖతార్లో చిక్కుకున్న జిల్లావాసులు
ఖతార్ రాజధాని నగరం దావోలో జిల్లావాసులు ఇద్దరు చిక్కుకున్నారు. నరసన్నపేటలోని జగన్నాథపురం సమీపాన సూరజ్నగర్కు చెందిన బంకుపల్లి సంజనా చందు.. గత ఆరేళ్లుగా దావోలోని ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేస్తున్నారు. తల్లిదండ్రులు బంకు చంద్రశేఖర్(రిటైర్డ్ ఎంఈవో), సుమబాల కోరిక మేరకు నెల రోజుల కిందట ఉద్యోగానికి రాజీనామా చేసేశారు. ఇటీవల స్వగ్రామానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ తరుణంలో అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం జరగడంతో ఖతార్లో విమానయాన, ఇతర ప్రయాణాలను నిలిపివేశారు. దీంతో స్వదేశం వచ్చేందుకు వీలులేక అక్కడ దావోలో తమ కుమార్తె ఇబ్బందులు పడుతోందని తల్లిదండ్రులు చంద్రశేఖర్, సుమబాల ఆందోళన చెందుతున్నారు. అక్కడ నెట్వర్క్ పనిచేయకపోవడంతో కుమార్తెతో ఫోన్లో కూడా మాట్లాడేందుకు వీలులేకపోతోందని వాపోతున్నారు. తమ కుమార్తెను స్వదేశం తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు చొరవ చూపాలని కోరుతున్నారు.
అలాగే శ్రీకాకుళం మండలం సింగుపురం గ్రామానికి చెందిన పీవీ వెంకటగౌతమ్ బెంగుళూర్లోని ఓ సాఫ్ట్వేర్ కెంపెనీలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కంపెనీ పనిపై వారం రోజుల కిందట ఖతర్ రాజధాని దావోస్ వెళ్లి చికున్నారు. ప్రస్తుతం అక్కడే ఓ హోటల్ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాడు. వెంకట్ గౌతమ్ తన భార్య, పిల్లలతో కలిసి బెంగుళూర్లో నివాసం ఉంటున్నాడు. నరసన్నపేటలోని అత్తమామలు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.