ఉరుకులు.. పరుగులు
ABN , Publish Date - Jun 22 , 2026 | 12:17 AM
1,920 candidates appeared for NEET వైద్య కళాశాలల్లో ప్రవేశాలకుగానూ ఆదివారం నిర్వహించిన ‘నీట్ యూజీ -2026’ పునఃపరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 వరకు జరిగింది. పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అభ్యర్థులను అనుమతించారు. కాగా మధ్యాహ్నం 12 గంటల తర్వాత వాతావరణంలో మార్పులు కారణంగా ఉరుకులు.. పరుగులతో అభ్యర్థులు కేంద్రాలకు చేరుకున్నారు.
పకడ్బందీగా నీట్ నిర్వహణ
జోరు వర్షంలో కేంద్రాలకు చేరుకునేందుకు అభ్యర్థుల అగచాట్లు
2,103 మందికి 1,920 మంది హాజరు
పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
శ్రీకాకుళం ఎడ్యుకేషన్/ ఎచ్చెర్ల/ క్రైం, జూన్ 21(ఆంధ్రజ్యోతి): వైద్య కళాశాలల్లో ప్రవేశాలకుగానూ ఆదివారం నిర్వహించిన ‘నీట్ యూజీ -2026’ పునఃపరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 వరకు జరిగింది. పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అభ్యర్థులను అనుమతించారు. కాగా మధ్యాహ్నం 12 గంటల తర్వాత వాతావరణంలో మార్పులు కారణంగా ఉరుకులు.. పరుగులతో అభ్యర్థులు కేంద్రాలకు చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వర్షం కురవడంతో అభ్యర్థులు, తల్లిదండ్రులు అగచాట్లు పడ్డారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్రానికి ఇద్దరు అభ్యర్థులు నిర్ణీత గడువులోగా చేరుకోలేకపోయారు. దీంతో వారిద్దరూ వెనుదిరిగారు. పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. క్షుణ్ణంగా తనిఖీ చేసి అభ్యర్థులను లోపలికి విడిచిపెట్టారు. చెవిదిద్దులు, జడక్లిప్పులు పెట్టుకున్న వారిని అనుమతించలేదు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు అవస్థలు పడకుండా ఉండేందుకు వెలుపల టెంట్లు ఏర్పాట్లు చేశారు.
పకడ్బందీగా.. పారదర్శకంగా
జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో నీట్ పకడ్బందీగా నిర్వహించామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఎచ్చెర్ల మండలం ఎస్.ఎం.పురంలోని ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్(ట్రిపుల్ ఐటీ), పెద్దపాడులోని కేంద్రీయ విద్యాలయం కేంద్రాలను ఆయన పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ‘విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా నిష్పక్షపాతంగా, అత్యంత పారదర్శకంగా నీట్ నిర్వహించాం. జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో 2,103 మంది అభ్యర్థులకుగానూ 1,920 మంది హాజరయ్యారు. 183 మంది గైర్హాజరయ్యారు. ట్రిపుల్ ఐటీ పరీక్షా కేంద్రంలో 720 మంది అభ్యర్థులకుగానూ 659 మంది హాజరయ్యారు. ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో 696 మందికి 639 మంది పరీక్ష రాశారు. కేంద్రీయ విద్యాలయంలో 447 మంది అభ్యర్థులకు 406 మంది హాజరయ్యారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 240 మంది కి 216 మంది పరీక్ష రాశార’ని తెలిపారు.
జిల్లాలోని నాలుగు పరీక్షా కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పర్యవేక్షించారు. పరీక్షల నిర్వహణలో భాగంగా ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, పది మంది ఎస్ఐలతోపాటు 150 మంది పోలీస్ సిబ్బందిని నియమించారు. నిబంధనల మేరకు కేంద్రాల వద్ద డోర్ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు ద్వారా తనిఖీలు చేశారు. మరోవైపు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రశ్నపత్రాలు రవాణా, భద్రత కోసం ప్రత్యేక ఎస్కార్ట్ బృందాలను ఏర్పాటు చేశారు. విద్యాశాఖ, రెవెన్యూశాఖ అధికారులతో సమన్వయంతో భద్రతా చర్యలు చేపట్టామని ఎస్పీ తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాలను అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్య, ఆర్డీవో కె.సాయిప్రత్యూష, డీఎస్పీ వివేకానంద పరిశీలించారు.