జ్యోతిబా పూలే ఆశయాలే.. అజెండా
ABN , Publish Date - Apr 12 , 2026 | 12:16 AM
Jyotiba Phule's birth anniversary మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలే అజెండాగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
అరసవల్లి, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలే అజెండాగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా శ్రీకాకుళంలో పొన్నాడ వంతెన వద్ద పార్కులో ఆయన విగ్రహానికి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్రమంత్రి మాట్లాడుతూ ‘జ్యోతిబా పూలే.. మానవ సమాజానికే ఒక ఆదర్శవాది. వెనుకబడిన, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి విద్య ఒక్కటే మార్గమని నమ్మి.. రెండు శతాబ్దాల కిందటే పాఠశాలను స్థాపించిన గొప్ప వ్యక్తి. సమానత్వం, స్త్రీ విద్య ద్వారానే సమసమాజ స్థాపన సాధ్యపడుతుందని నిరూపించారు. పూలే ఆశయాలకు అనుగుణంగా కూటమి పాలన సాగిస్తున్నామ’ని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల పిల్లల విద్యకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.