ఇంత పర్యవేక్షణ లోపమా?
ABN , Publish Date - Aug 13 , 2026 | 12:08 AM
Identification of defects instructures పైడిభీమవరం పంచాయతీలో రాష్ట్రస్థాయి అధికారుల బృందం విస్తృత తనిఖీలు చేపట్టింది. పంచాయతీలో సుమారు రూ.7 కోట్లకుపైగా నిధులు దుర్వినియోగమైన ఇటీవల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మండలస్థాయి అధికారులు విచారణ చేపట్టారు. ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. కానీ ఈ విచారణపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి.
రాష్ట్రస్థాయి అధికారుల బృందం ఆగ్రహం
పైడిభీమవరం పంచాయతీలో పర్యటన
నిర్మాణాల్లో లోపాలు గుర్తింపు
నిధుల పక్కదారిపై సమగ్ర విచారణ
రణస్థలం, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): పైడిభీమవరం పంచాయతీలో రాష్ట్రస్థాయి అధికారుల బృందం విస్తృత తనిఖీలు చేపట్టింది. పంచాయతీలో సుమారు రూ.7 కోట్లకుపైగా నిధులు దుర్వినియోగమైన ఇటీవల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మండలస్థాయి అధికారులు విచారణ చేపట్టారు. ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. కానీ ఈ విచారణపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. విచారణకు రాష్ట్రస్థాయి అధికారులను పంపించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ విజయకుమారి, విశాఖ జడ్పీ సీఈవో నారాయణమూర్తి, పంచాయతీరాజ్ జేడీ రామ్నాథ్రెడ్డి, పంచాయతీరాజ్ విజయవాడ ఎస్ఈ రఘురామిరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ విజయవాడ డీఈ సత్యనారాయణ, పలాస డివిజన్ అభివృద్ధి అధికారి సతీష్, జిల్లా పంచాయతీరాజ్ ఏవో చక్రవర్తి, పీడీవో తిరుపతిరావు, టెక్కలి పంచాయతీ జేఏ లోకేశ్వరరావుతో కూడిన బృందం బుధవారం పైడిభీమవరం పంచాయతీ పరిధిలో చేపట్టిన ప్రతి నిర్మాణాన్ని పరిశీలించింది. ఎక్కడికక్కడే రోడ్లు, కాలువల నిర్మాణంలో నాణ్యతాలోపం ఉన్నట్టు గుర్తించారు. దీనిపై పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ విజయకుమారి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నాసిరకంగా పనులు చేస్తారా? అంటూ అధికారులపై మండిపడ్డారు. రికార్డులను పరిశీలించారు. గతంలో చేపట్టిన విచారణ అంశాలపై సైతం ఆరా తీశారు. మొత్తం నివేదిక రూపంలో ప్రభుత్వానికి ఇస్తామని తెలిపారు.
ఏం జరిగిందంటే?
పైడిభీమవరం మేజర్ పంచాయతీలో ఈ ఏడాది జూన్లో భారీ అవినీతి వెలుగులోకి వచ్చింది. గత ఏడాది మే నాటికి రూ.9.43 కోట్లు పంచాయతీ సాధారణ నిధులు ఉండగా.. అక్కడకు పది నెలల కాలంలోనే రూ.7.5 కోట్లు ఖర్చుచేసినట్టు అధికారులు గుర్తించారు. సీసీ రోడ్లతో పాటు వాటికి సంబంధించి శానిటేషన్ ఖర్చులకుగాను రూ.2.52 కోట్లు ఖర్చుచేసినట్టు చూపించారు. గత ఏడాది ‘మత్స్యకారుల సేవలో’ కార్యక్రమానికి ఏప్రిల్లో సీఎం చంద్రబాబు వచ్చిన సమయంలో పంచాయతీ పరిధిలో శానిటేషన్ పనులు చేసినందుకుగాను రూ.16 లక్షలను ఖర్చుగా చూపించారు. పారిశుధ్య కార్మికులు 25 మంది ఉండగా.. వారి యూనిఫాం ఖర్చును రూ.8 లక్షలుగా చూపించారు. పారిశుధ్య సూపర్వైజర్ ఖాతా ద్వారా ఏకంగా రూ.69 లక్షల నిధులు మళ్లించినట్టు ఫిర్యాదులు వెళ్లాయి. పంచాయతీ సాధారణ నిధులు రూ.3కోట్లకుపైగా పక్కదారి పట్టించినట్టు అధికారులకు ఫిర్యాదులందాయి. దీనిపై రాష్ట్రస్థాయి అధికారుల బృందం పరిశీలిస్తుండడంతో.. ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది.