పోలీసుల అదుపులో కేటుగాడు?
ABN , Publish Date - Mar 25 , 2026 | 12:07 AM
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు పేరిట ఓ మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగికి టోకరా వేసిన కేటుగాడుని టెక్కలి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
గుట్టుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు
టెక్కలి, మార్చి 24 (ఆంఽధ్రజ్యోతి): కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు పేరిట ఓ మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగికి టోకరా వేసిన కేటుగాడుని టెక్కలి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసు దర్యాప్తును గుట్టుగా కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. జిల్లాకు చెందిన ఓ మహిళా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. టెక్కలికి చెందిన ఓ వ్యక్తి ఫేక్ ప్రొఫైల్తో సామాజిక మాధ్యమం ద్వారా ఆమెకు పరిచయమయ్యాడు. కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు పేరిట తరచూ ఆమెతో చాటింగ్ చేసేవాడు. ఈక్రమంలో ఆమె నుంచి విడతలవారీగా రూ.40లక్షలు తీసుకున్నాడు. ఆమె సైతం తనతో రామ్మోహన్నాయుడు ఇంతగా సామాజిక మాధ్యమంలో పరిచయం అవడాన్ని గొప్పగా ఫీలై రూ.40లక్షలు ఫోన్పే ద్వారా ముట్టజెప్పినట్లు సమాచారం. ఈ కేటుగాడి బండారం బయటపడడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం. బాధితురాలు తన పేరును బయటకు చెప్పేందుకు ముందుకు రావడం లేదు. ఈ విషయమై సీఐ విజయ్కుమార్ వద్ద ప్రస్తావించగా.. ఈ కేసుపై ఎటువంటి సమాచారం లేదని, ఫిర్యాదు కూడా అందలేదని తెలిపారు.