విద్యార్థిని పూజిత మృతిపై విచారణ
ABN , Publish Date - Apr 04 , 2026 | 12:31 AM
స్థానిక బీఆర్ అంబేద్కర్ గురుకులంలో 7వ తరగతి విద్యార్థిని చింతల పూజిత మృతిపై ఏపీ బాలల హక్కుల కమిషన్ సభ్యులు ఎంజీ సూర్యనారాయణ, సీహెచ్ మధుసూదనరావు, పి.నాగ మానస శుక్రవారం విచారణ చేపట్టారు.
బాలల హక్కుల కమిషన్ సభ్యుల ఆరా
కోటబొమ్మాళి, పాతపట్నంలో పర్యటన
పాతపట్నం/రూరల్, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): స్థానిక బీఆర్ అంబేద్కర్ గురుకులంలో 7వ తరగతి విద్యార్థిని చింతల పూజిత మృతిపై ఏపీ బాలల హక్కుల కమిషన్ సభ్యులు ఎంజీ సూర్యనారాయణ, సీహెచ్ మధుసూదనరావు, పి.నాగ మానస శుక్రవారం విచారణ చేపట్టారు. తొలుత పూజిత స్వగ్రామమైన కోటబొమ్మాళి వెళ్లి కుటుం బ సభ్యులతో మాట్లాడారు. అనంతరం పాతప ట్నంలోని డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తోటి విద్యార్థినులతో మాట్లాడి ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై ప్రిన్సిపాల్, సిబ్బందిని ప్రశ్నించారు. అనంతరం గురుకులంలో మెనూ అమలుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వంటగది స్టోర్రూం, డార్మెటరీ తదితర సౌకర్యాలను, రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. గురుకులం నిర్వహణ, సిబ్బందిని సమన్వయపరచడంలో ప్రిన్సిపాల్ పద్మావతి వైఫల్యాలపై అసహనం వ్యక్తం చేశారు. వారివెంట ఐసీడీఎస్ సూపర్వైజర్ జి.అనూరాధ, బోధనా సిబ్బంది తదితరులు ఉన్నారు.
కఠిన శిక్ష పడేలా చూస్తాం
హిరమండలం, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): ఇటీవల పాతహిరమండలం గ్రామానికి చెందిన గిరిజన బాలికపై అత్యాచారం, ఆపై హత్య చేసిన వ్యక్తికి కఠిన శిక్షపడేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఏపీ బాలల హక్కుల కమిషన్ సభ్యులు బాధిత కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు బాలిక కుటుంబాన్ని పరామర్శించి, ఘటన జరిగిన తీరును ఆమె తల్లిని అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు విషయాలు ఎస్ఐ హేమంత్ కల్యాణ్ను అడిగి తెలుసుకున్నారు. నివేదిక కాపీని తమకు అందజేయాలని ఎస్ఐకి సూచించారు. ఆదివాసీ గిరిజన సంఘ నాయకులు యోగి మాట్లాడుతూ.. కేసు దర్యాప్తులో అనుమానాలు ఉన్నాయని కమి షన్ సభ్యుల దృష్టికి తీసుకు వెళ్లాడు. మృతురాలిని తీసుకు వచ్చిన కారును ఇంతవరకు పోలీసులు స్వాధీనం చేసుకో లేదని, ఆ కారులో ఎంతమంది ఉన్నారో ఇంకా తేల్చలేదని తెలిపారు. టోల్ గేట్ల వద్ద సీసీ ఫుటేజీలు పరిశీలిస్తే ఈ వివరాలు పొందవచ్చని... కానీ ఆ దిశగా పోలీసులు దృష్టి పెట్టలేదని కమిషన్ సభ్యులకు వివరించారు. బాలికను శ్రీకూర్మం తీసుకువెళ్లి వెంకటరావుకి అప్పగించే సమయంలో అతడితో మరో ఐదుగురు అమ్మాయిలు ఉన్నట్టు తండ్రి చె బుతున్నారని... వారి వివరాలు ఇంతవరకు వెల్ల డించలేదని కమిషన్ సభ్యులకు తెలిపారు. దీనిపై సభ్యులు స్పందిస్తూ... బాలిక మృతికి కారకుడైన వ్యక్తికి కఠిన శిక్షపడేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసు కువస్తామని చెప్పారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కమిటీ సభ్యులు నాగమానస, ఎంజీ సూర్యనారాయణ, చల్లా మధుసూదన రావు, జిల్లా బాలల రక్షణ అధికారి కేవీ రమణ, ఐసీడీఎస్ పీవో ఎం.మల్లేశ్వరరావు, సీడీపీ ఉమాజానకి, సూపర్వైజర్ లక్ష్మీబాయి తదితరులు ఉన్నారు.