విద్యార్థినులకు వేధింపులపై విచారణ
ABN , Publish Date - Feb 18 , 2026 | 11:57 PM
ఆర్జీ యూకేటీ శ్రీకాకుళం క్యాంపస్లో ఇంజనీరింగ్ విద్యా ర్థినులను కొంతమంది అధ్యాపక, అధ్యా పకేతర సిబ్బంది వేధిస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు అంతర్గత కమిటీ విచారణ చేపట్టింది.
ఎచ్చెర్ల, ఫిబ్రవరి 18((ఆంధ్రజ్యోతి): ఆర్జీ యూకేటీ శ్రీకాకుళం క్యాంపస్లో ఇంజనీరింగ్ విద్యా ర్థినులను కొంతమంది అధ్యాపక, అధ్యా పకేతర సిబ్బంది వేధిస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు అంతర్గత కమిటీ విచారణ చేపట్టింది. విద్యార్థినులను కొంతమంది అధ్యా పక, అధ్యాపకేతర సిబ్బంది వేధింపులకు పాల్పడుతున్నారంటూ గతేడాది డిసెంబరులో ఉన్నతాధికారులకు ఈ-మెయిల్లో ఫిర్యాదు వచ్చింది. దీనిపై పెద్ద దుమారం రేగింది. ఈ వ్యహారంపై ఇప్పటికే రెండుసార్లు ఉన్నతాధి కారులు విచారణ చేపట్టారు. తాజాగా, బుధవారం నూజివీడు నుంచి వచ్చిన ఆరు గురు సభ్యులతో కూడిన అంతర్గత కమిటీ ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్ను సందర్శిం చింది. వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిని ఈ కమిటీ సభ్యు లు విచారిస్తున్నారు. ఈ కమిటీలో నూజివీడు క్యాంపస్కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రావణ కనకకుమారి, నాగార్జునదేవి, కాంట్రాక్ట్ సిబ్బంది దుర్గాభవాని, సురేష్బాబు, రాజేష్, వేణుగోపాల్లు ఉన్నారు. ఈ కమిటీ రెండు రోజుల పాటు క్యాంపస్లో విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నారు.
గతంలో కూడా విచారణ..
గతేడాది డిసెంబరు 16న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఈ క్యాంపస్ను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. బాలికలు, మహిళల రక్షణ కోసం ప్రత్యేకించి పోక్సో, పోష్ చట్టాలపై అవగాహన కల్పించి, విద్యార్థినులకు భరోసా కల్పించారు. అదే రోజు ఆర్జీయూకేటీ చాన్సలర్ ప్రొఫెసర్ కె.మధుమూర్తి క్యాంపస్ను సందర్శించి విద్యార్థినులు, అధికారులతో వేర్వేరుగా మాట్లాడారు.
నూజివీడు క్యాంపస్ ఈఈఈ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రావణ కనక కుమారి, న్యాయవాది పద్మజ, హెచ్సీ టి.సరితతో కూడిన కమిటీ అప్పట్లో రెండు రోజుల పాటు క్యాంపస్లో ఉండి విద్యార్థినుల నుంచి వేర్వేరుగా వివరాలు సేకరించారు. విద్యార్థినులు, సిబ్బంది నుంచి వేర్వేరుగా సమాచారం సేకరించారు. విద్యార్థినులతో ప్రత్యేకంగా మాట్లాడి క్యాంపస్లో ఏమి జరుగుతుందో వివరాలు తెలుసుకున్నారు.