టెక్కలికి సమీకృత ఆయుష్
ABN , Publish Date - Feb 17 , 2026 | 12:00 AM
50-bed hospital sanctioned at Rs. 15 crore టెక్కలి నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కానుక ప్రకటించింది. టెక్కలిలో రూ.15కోట్లతో 50పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటు చేయనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్మాణ పనులకు తొలివిడతగా రూ.2కోట్లు మంజూరు చేసింది.
రూ.15కోట్లతో 50పడకల ఆసుపత్రి మంజూరు
ఒకేచోట ఆయుర్వేద, యోగా, నేచురోపతి వైద్యం
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
టెక్కలి, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): టెక్కలి నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కానుక ప్రకటించింది. టెక్కలిలో రూ.15కోట్లతో 50పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటు చేయనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్మాణ పనులకు తొలివిడతగా రూ.2కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు ఆయుష్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కె.దినేష్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ‘ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. సమీకృత ఆయుష్ ఆసుపత్రి ఒకే వేదికపై రావడం ద్వారా ఆయుర్వేద, యోగా, నేచురోపతి వైద్యసేవలు గ్రామీణ, దూరప్రాంత ప్రజలకు మరింత చేరువకానున్నాయి. జాతీయ ఆయుష్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి గరిష్ఠ నిధులు రాబట్టి.. ఆయుష్ వైద్యసేవలు మెరుగుపరుస్తాం. ఈ ప్రాజెక్ట్కు సంబంధించి ఆయుష్ శాఖ అధికారులు అవసరమైన పరిపాలన ఉత్తర్వులను జారీ చేశారు. ఐపీహెచ్ఎస్, నేషనల్ ఆయుష్ మిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని ఆధునిక సౌకర్యాలతో ఈ ఆసుపత్రి నిర్మిస్తే ఆయుష్ వైద్యసేవలు ఈ ప్రాంత ప్రజానీకానికి అందుబాటులోకి రానున్నాయి. నిర్మాణ పనుల బాధ్యతను ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అప్పగించార’ని అచ్చెన్న వెల్లడించారు. ఆయుష్ ఆస్పత్రి మంజూరుపై ఏఎంసీ చైర్మన్ బగాది శేషగిరి, నందిగాం మండల టీడీపీ అధ్యక్షుడు పినకాన అజయ్కుమార్, టీడీపీ నాయకులు ఎల్ఎల్ నాయుడు, పోలాకి చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు.