బీపీఎస్కు త్వరపడండి
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:21 AM
The BPS deadline అక్రమ భవనాల క్రమబద్ధీకరణకు(బీపీఎస్) రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు సమీపిస్తుంది. ఈ నెల 11వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తుకు గడువు ముగియనుంది. కాగా.. జిల్లాలో అరకొరగా దరఖాస్తులు రావడంతో.. బీపీఎస్ ప్రయోజనాలపై సచివాలయ, మునిసిపల్ టౌన్ప్లానింగ్ అధికారులు, సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
ఈ నెల 11తో ముగియనున్న గడువు
తక్కువస్థాయిలో దరఖాస్తులు
అవగాహన కల్పిస్తున్న టౌన్ప్లానింగ్ సిబ్బంది
పలాస, మార్చి 1(ఆంధ్రజ్యోతి): అక్రమ భవనాల క్రమబద్ధీకరణకు(బీపీఎస్) రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు సమీపిస్తుంది. ఈ నెల 11వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తుకు గడువు ముగియనుంది. కాగా.. జిల్లాలో అరకొరగా దరఖాస్తులు రావడంతో.. బీపీఎస్ ప్రయోజనాలపై సచివాలయ, మునిసిపల్ టౌన్ప్లానింగ్ అధికారులు, సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. భవనాలు క్రమబద్ధీకరించుకోలేకపోతే కలిగే అనర్థాలు, ఇబ్బందులను వివరిస్తున్నారు. జిల్లాలో శ్రీకాకుళం కార్పొరేషన్, ఆమదాలవలస, పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మునిసిపాలిటీలు ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో బీపీఎస్ స్కీమ్ ప్రవేశపెట్టినప్పుడు జిల్లావ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. కానీ గత వైసీపీ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్, బీపీఎస్లపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. అనేక అనధికార కట్టడాలు, అనుమతులు లేని లేఅవుట్లు ఇష్టారాజ్యంగా ఉన్నాయి. వీటన్నింటినీ క్రమబద్ధీకరించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. భవనాలు క్రమబద్దీకరించడం వల్ల పుర ఆదాయం కూడా అమాంతంగా పెరిగే అవకాశలు ఉండడంతో బీపీఎస్కు అవకాశం కల్పించింది. వాస్తవానికి జనవరి నాటికే ఈ పథకం గడువు పూర్తయింది. ప్రజల నుంచి వస్తున్న వినతుల కారణంగా దీన్ని ఈ నెల 11 వరకూ పొడిగించింది. కాగా ఇప్పటివరకూ శ్రీకాకుళం కార్పొరేషన్లో మొత్తం 443 మంది బీపీఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. పలాస-కాశీబుగ్గలో 145, ఇచ్ఛాపురంలో 48, ఆమదాలవలసలో కేవలం 41 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దరఖాస్తుల సంఖ్య పెంచేందుకు టౌన్ప్లానింగ్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. కొద్దిరోజుల్లోనే బీపీఎస్ గడువు ముగియనుండడంతో అక్రమ నిర్మాణ దారులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
అవగాహన కల్పిస్తున్నాం
బీపీఎస్ మంచి పథకం. అక్రమ నిర్మాణాలకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఇళ్లకు చట్టబద్ధత లభిస్తుంది. బ్యాంకుల్లో రుణాలు కూడా తీసుకోవచ్చు. మునిసిపాలిటీ పరంగా తాగునీరు, రహదారులు, కాలువలు నిర్మించేందుకు అవకాశాలు ఉంటాయి. దీనిపై ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి.
- ఇ.శ్రీనివాసులు, కమిషనర్, పలాస-కాశీబుగ్గ