ఆరుతడి పంటలతో అధిక దిగుబడులు
ABN , Publish Date - Sep 16 , 2026 | 11:26 PM
: రైతులు ఆరుతడి పంటలు సాగుచేస్తే అధిక దిగుబడులను సాధించటంతో పాటు తక్కువ పెట్టుబడితో లాభాలను సాధించవచ్చని వ్యవసాయ శాఖ జేడీ వైవీ మురళీకృష్ణ తెలిపారు.
జేడీ వైవీ మురళీకృష్ణ
ఎల్.ఎన్.పేట, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): రైతులు ఆరుతడి పంటలు సాగుచేస్తే అధిక దిగుబడులను సాధించటంతో పాటు తక్కువ పెట్టుబడితో లాభాలను సాధించవచ్చని వ్యవసాయ శాఖ జేడీ వైవీ మురళీకృష్ణ తెలిపారు. రావిచెంద్రి గ్రామంలో బుధవారం జరిగిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుతడి పంటలకు నీటి తడులను మూడు లేదా నాలుగుసార్లు కడితే సరిపోతుందన్నారు. సేంద్రీయ ఎరువులతో భూసారం పెరగటంతో పాటు పెట్టుబడి తక్కువ మొత్తంలో ఉంటుందన్నారు. వరిలో అధిక దిగుబడులు సాధించేందుకు పొటాష్ను తగిన మోతాదులో వినియోగించాలని ఆయన సూచించారు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా జీలుగు ద్రావణాన్ని తయారు చేసినట్టు చెప్పారు. ఈ ఏడాది జిల్లాలో 1.59 హెక్టార్లులో వరి, 750 హెక్టార్లలో పత్తి, 6,296 హెక్టార్లులో వేరుశనగ పంటలను రైతులు సాగుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం రావిచెంద్రి గ్రామసచివాలయంలో ఆయన మాట్లాడుతూ సస్యరక్షణ, అధిక దిగుబడులు సాధన, తెగుళ్లు గుర్తింపు, రసాయనిక ఎరువుల వాడకంపై రైతులకు వివరించారు. ఆయనతోపాటు కొత్తూరు డివిజన్ ఏడీ బి.రాజగోపాల్, రాగోలు వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త ఉదయ్బాబు, మండల వ్యవసాయాధికారి కిరణ్వాణి, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
ఆధునిక పద్ధతులపై అవగాహన
హిరమండలం, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కోదూరు గ్రామంలో రైతులకు రెండు రోజులుగా ఆర్పీఎల్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమానికి హాజరైన జేడీ వైమురళీకృష్ణ మాట్లాడుత కార్పొరేట్ తరహా ఆలోచనా విధానంతో వ్యవసాయం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు, ఏవో సంధ్య పాల్గొన్నారు.