మంచినీళ్లపేటకు మంచి రోజులు
ABN , Publish Date - Jul 09 , 2026 | 12:25 AM
వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో చేపడుతున్న ఫిష్ లాండింగ్ సెంటర్ (మత్స్యకారుల వలలు, పడవలు నిలుపుకొనే సదుపాయం) పనులకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు నిధులను మంజూరు చేసింది.
- ఫిష్ లాండింగ్ సెంటర్కు రూ.1.04 కోట్ల అదనపు నిధులు
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
శ్రీకాకుళం, జూలై 8(ఆంధ్రజ్యోతి): వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో చేపడుతున్న ఫిష్ లాండింగ్ సెంటర్ (మత్స్యకారుల వలలు, పడవలు నిలుపుకొనే సదుపాయం) పనులకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు నిధులను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు వీలుగా అదనంగా రూ.1.04 కోట్లు కేటాయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెండింగ్ బిల్లుల చెల్లింపుతో పాటు, మిగిలిన ప్రాజెక్టు పనులను సత్వరమే పూర్తి చేసేందుకు ఈ నిధులను కేటాయిస్తున్నట్లు పేర్కొంది. మత్స్యశాఖ కమిషనర్ చేసిన ప్రతిపాదనల మేరకు, వాటిని పరిశీలించిన అనంతరం ప్రభుత్వ ఎక్స్-అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్ ఈ నిధులకు పరిపాలనాపరమైన ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. పనులు సత్వరమే పూర్తి చేయడానికి వీలుగా ట్రెజరీ నియంత్రణ, త్రైమాసిక నిబంధనల నుంచి ఈ నిధులకు ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. రూ.1.04 కోట్లను కేవలం ఫిష్ లాండింగ్ సెంటర్ పనులకే వినియోగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర పనులకు మళ్లించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సంబంధిత డ్రాయింగ్ ఆఫీసర్ ద్వారా నిధుల డ్రా ప్రక్రియ జరగాలని, ఆడిట్కు జవాబుదారీగా ఉంటూ సరైన విధానాలను పాటించాలని మత్స్య శాఖ కమిషనర్ను ఆదేశించింది.