నడవలేకున్నా.. నాన్న రుణం తీర్చుకుని..
ABN , Publish Date - Jul 01 , 2026 | 12:19 AM
To the cemetery in a wheelchair విధి ఆ కుటుంబంపై పగ పట్టింది. తండ్రీ కొడుకు.. ఇద్దరూ కొంతకాలంగా మంచాన పడి లేవలేని స్ధితిలో ఉన్నారు. ఆ కుటుంబానికి జీవానాధారం కష్టంగా మారింది. ఇంతలో తండ్రి మృతి చెందారు. మంచాన పడి లేవలేని స్థితిలో ఉన్న కొడుకు తన తండ్రికి తలకొరివి పెట్టిన దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది.
తండ్రికి తలకొరివి పెట్టిన కుమారుడు
వీల్చైర్పైనే శ్మశానవాటికకు చేరుకున్న వైనం
జి.సిగడాం, జూన్ 30(ఆంధ్రజ్యోతి): విధి ఆ కుటుంబంపై పగ పట్టింది. తండ్రీ కొడుకు.. ఇద్దరూ కొంతకాలంగా మంచాన పడి లేవలేని స్ధితిలో ఉన్నారు. ఆ కుటుంబానికి జీవానాధారం కష్టంగా మారింది. ఇంతలో తండ్రి మృతి చెందారు. మంచాన పడి లేవలేని స్థితిలో ఉన్న కొడుకు తన తండ్రికి తలకొరివి పెట్టిన దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళితే.. జి.సిగడాం మండలం మర్రివలస పంచాయతీ మానంపేట గ్రామానికి చెందిన కంచెర్ల సవర్రాజు (62) రెండు నెలల కిందట పక్షవాతంతో మంచం పట్టాడు. మంగళవారం మృతి చెందాడు. ఈయనకు భార్య మీన, కుమారుడు సురేష్, కోడలు శ్రావణి, మనవలు విరాట్, దర్శి ఉన్నారు. సురేష్ ప్రైవేట్ జాబ్ చేస్తూ జీవనం సాగించేవాడు. రెండేళ్ల కిందట బ్రెయిన్స్ర్టోక్తో సురేష్ మంచం పట్టి లేవలేని స్థితిలో ఉన్నాడు. కాగా.. తండ్రి మృతి చెందడంతో వీల్చైర్ సహాయంతో శ్మశానవాటికకు చేరుకుని తలకొరివి పెట్టాడు. జన్మనిచ్చిన కన్నతండ్రి రుణం తీర్చుకున్నాడు. ఈ దృశ్యం స్థానికులు, బంధువులను కంటతడి పెట్టించింది. ఓ వైపు భర్త మృతి, మరోవైపు లేవలేని స్థితిలో ఉన్న కుమారుడి పరిస్థితి చూసి.. మీన బోరున విలపించింది. తమకు దిక్కెవరని రోదించింది. ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.