మూడోసారి కూలిన డ్రైనేజీ
ABN , Publish Date - Aug 24 , 2026 | 12:03 AM
Quality defect before the start సరుబుజ్జిలిలోని నాలుగు రోడ్ల విస్తరణ పనుల్లో నాణ్యతా లోపం మరోసారి బయటపడింది. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన డ్రైనేజీ మూడోసారి కూలిపోయింది. అధికారుల పర్యవేక్షణ లోపంతో పనులు నాసిరకంగా సాగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రారంభానికి ముందే బయటపడుతున్న నాణ్యతాలోపం
రూ.12కోట్ల పనులపై విమర్శలు
సరుబుజ్జిలి, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): సరుబుజ్జిలిలోని నాలుగు రోడ్ల విస్తరణ పనుల్లో నాణ్యతా లోపం మరోసారి బయటపడింది. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన డ్రైనేజీ మూడోసారి కూలిపోయింది. అధికారుల పర్యవేక్షణ లోపంతో పనులు నాసిరకంగా సాగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రారంభానికి ముందే డ్రైనేజీ గోడలు కూలిపోవడం చర్చనీయాంశమవుతోంది. ‘అలికాం-బత్తిలి ప్రధాన రహదారి (రెండు కిలోమీటర్లు), పాలకొండ - కొమ్మనపాల్లి రహదారి (600 మీటర్లు), సరుబుజ్జిలిలో నాలుగు రోడ్ల విస్తరణ, డ్రైనేజీ, డివైడర్ పనుల కోసం ప్రభుత్వం రూ.12కోట్లు మంజూరు చేసింది. ఎమ్మెల్యే కూన రవికుమార్ చొరవతో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కేటాయించింది. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్ ఈ పనులు పూర్తిచేశారు. కాగా ప్రారంభానికి ముందే ఆదివారం ఉదయం హిరమండలం రోడ్డులో డ్రైనేజీ గోడ కూలిపోయింది. గతంలో కూడా ఇదేమాదిరి రెండుసార్లు జరిగింది. అలాగే తారురోడ్డు కూడా పలుచోట్ల నాణ్యత లోపించి గుంతలమయంగా మారుతోంది. దీంతో ఎప్పటిలాగే రోడ్డుపై వర్షపునీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్అండ్బీ అధికారుల పర్యవేక్షణ లోపంతో పనుల్లో నాణ్యత లోపించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై శ్రీకాకుళం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ను ఫోన్లో పలుమార్లు సంప్రదించినా.. స్పందించకపోవడం గమనార్హం.