ఆదిత్యాలయ అభివృద్ధి.. మా బాధ్యత
ABN , Publish Date - Mar 21 , 2026 | 11:47 PM
Foundation stone laid for Indra Pushkarini works అరసవల్లిలో ఆదిత్యాలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి, గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిద్దిదడం మా బాధ్యత అని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
రూ.4కోట్లతో ఇంద్రపుష్కరిణి పనులకు శంకుస్థాపన
నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నాం
కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు
అరసవల్లి, మార్చి 21(ఆంధ్రజ్యోతి)ః అరసవల్లిలో ఆదిత్యాలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి, గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిద్దిదడం మా బాధ్యత అని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రూ.4కోట్లతో చేపట్టనున్న ఇంద్రపుష్కరిణి అభివృద్ధి పనులకు.. రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ‘ఆలయాన్ని మాస్టర్ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకంలో చేర్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాం. ఆలయ పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతాం. ఇంద్రపుష్కరిణి పనులు మూడు నెలల్లో పూర్తిచేయాలని కాంట్రాక్టర్లు, అధికారులకు ఆదేశాలు జారీ చేశామ’ని తెలిపారు. ‘కార్గిల్ అమరవీరుల త్యాగానికి గుర్తుగా స్థానిక జడ్పీ కార్యాలయం ఎదురుగా హౌసింగ్ బోర్డు కోలనీలో రూ.2కోట్లతో పార్కును అభివృద్ధి చేశాం. నగర సుందరీకరణ పనుల్లో భాగంగా రామలక్ష్మణ జంక్షన్ నుంచి పెద్దపాడు వరకు ఆహ్లాదంగా రహదారులను తీర్చిదిద్దాం. శ్రీకాకుళం నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం’ కేంద్రమంత్రి తెలిపారు. అనంతరం తాగునీటి ఆర్వో వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీవో సాయిప్రత్యూష, ఈవో కేఎన్వీడీవీ ప్రసాద్, ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, అధికారులు, ఆలయ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు.