మెట్టూరులో అక్రమ కట్టడాలు కూల్చివేత
ABN , Publish Date - Jul 23 , 2026 | 12:21 AM
కొత్తూరు మండలం మెట్టూరు బిట్-1 పరిధిలోని వంశధార ఇరిగేషన్ స్థలాన్ని కొందరు ఆక్రమించి.. ఆలయాన్ని నిర్మించినట్టు 2024లో జనసేన నాయకులు బూర్లె శ్రీను పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు.
మెళియాపుట్టి (కొత్తూరు), జూలై 22 (ఆంధ్రజ్యోతి): కొత్తూరు మండలం మెట్టూరు బిట్-1 పరిధిలోని వంశధార ఇరిగేషన్ స్థలాన్ని కొందరు ఆక్రమించి.. ఆలయాన్ని నిర్మించినట్టు 2024లో జనసేన నాయకులు బూర్లె శ్రీను పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు ఇరిగేషన్ స్థలంలో కొంతమంది నిర్మాణాలు చేపడుతున్నట్టు గుర్తించారు. అయినా కట్టడాల నిలుపుదల చేయకపోవటంతో శ్రీను హైకోర్టును అశ్రయించారు. కోర్టు ఉత్తర్వులను కూడా అధికారులు అమలు చేయలేదు. దీంతో కోర్టు ధిక్కారం కింద అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆక్రమణలు కూల్చివేతకు కదిలారు. బుధవారం ఆక్రమిత స్థలంలో నిర్మించినట్టు చెబుతున్న శివాలయాన్ని కూల్చివేశారు. తగాదాలకు ఆస్కారం లేకుండా స్థానికులను ఒప్పించారు. మరోచోట ఆలయాన్ని నిర్మిస్తామని వారికి హామీ ఇచ్చారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టెక్కలి ఆర్డీవో ఎం.కృష్టమూర్తి, సీఐ చింతాడ ప్రసాదరావు, తహసీల్దార్ పి.సరోజిని, ఎస్ఐ వెంకటేష్ ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.