సాంకేతిక వినియోగంతో నేర నియంత్రణ
ABN , Publish Date - Jul 02 , 2026 | 11:48 PM
Treat people courteously ‘నేర నియంత్రణలో భాగంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థంగా వినియోగించాలి. శాంతిభ ద్రతల పరిరక్షణకు నిరంతరం అప్రమత్తంగా ఉండాల’ని విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్జెట్టి పోలీసులను ఆదేశించారు.
ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించండి
విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్జెట్టి
శ్రీకాకుళం క్రైం, జూలై 2(ఆంధ్రజ్యోతి): ‘నేర నియంత్రణలో భాగంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థంగా వినియోగించాలి. శాంతిభ ద్రతల పరిరక్షణకు నిరంతరం అప్రమత్తంగా ఉండాల’ని విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్జెట్టి పోలీసులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డితో కలిసి శ్రీకాకుళం రూరల్, ఆమదాలవలస, గార పోలీస్స్టేషన్లను పరిశీలించారు. జనరల్ డైరీలు, ఎఫ్ఐఆర్లు, కేసు డైరీలు, స్టేషన్ రికార్డులు, మాల్ఘానా నిర్వహణ, ఆయుధాల భద్రత, స్టేషన్ పరిశుభ్రత, డిజిటల్ రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల పురోగతి, నేరాల దర్యాప్తు తీరు, మహిళలు, చిన్నారులకు సంబంధించిన కేసులు విచారణ, సీసీటీఎన్ఎస్ నమోదులో తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్స్టేషన్లలో ప్రజలకు అందిస్తున్న సేవలు, ఫిర్యాదుల స్వీకరణ విధానం, ఫిర్యాదులపై స్పందన తీరు, బాధితులకు అందిస్తున్న సహాయం, సిబ్బంది పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఐజీ గోపీనాథ్జెట్టి మాట్లాడుతూ ‘ప్రతి కేసును నాణ్యతతో దర్యాప్తు చేసి సకాలంలో పూర్తి చేయాలి. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ సేవలు అందించాలి. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, రికార్డుల నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలు పాటించాల’ని తెలిపారు. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రజలకు మరింత మెరుగైన పోలీసింగ్ సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు పోలీసుల పనితీరును మరింత సమర్థంగా తీర్చిదిద్దడంతోపాటు నేర నియంత్రణ, దర్యాప్తు నాణ్యత, ప్రజా సేవల మెరుగుదలకు ప్రత్యేక చర్యలు కొనసాగిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ వివేకానంద, పోలీసు అధికారులు పాల్గొన్నారు.