తప్పని నిరీక్షణ
ABN , Publish Date - Jun 23 , 2026 | 11:49 PM
Transfers for 321 MTS teachers బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం ఎంటీఎస్(మినిమం టైం స్కేల్) ఉపాధ్యాయులు గంటల తరబడి నిరీక్షించారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో సోమవారం డీఎస్సీ -2008 చెందిన 108 మంది ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ చేపట్టారు. మంగళవారం 1998 - డీఎస్సీకి చెందిన 213 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు.
ముగిసిన ఎంటీఎస్ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్
321 మందికి బదిలీ
శ్రీకాకుళం ఎడ్యుకేషన్, జూన్ 23(ఆంధ్రజ్యోతి): బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం ఎంటీఎస్(మినిమం టైం స్కేల్) ఉపాధ్యాయులు గంటల తరబడి నిరీక్షించారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో సోమవారం డీఎస్సీ -2008 చెందిన 108 మంది ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ చేపట్టారు. మంగళవారం 1998 - డీఎస్సీకి చెందిన 213 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆర్జేడీ విజయ్భాస్కరరావు, డీఈవో రవిబాబు, ఏడీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. కాగా.. మంగళవారం ఉదయం 10 గంటలకు ఉపాధ్యాయులు చేరుకోగా.. మధ్యాహ్నం 2 గంటల వరకూ కౌన్సెలింగ్ నిర్వహించలేదు. ఖాళీల వివరాలు ప్రకటించడంలో జాప్యం, 40 శాతం మంది ఉపాధ్యాయులు సుదూర ప్రాంతాల నుంచి హాజరుకావాల్సి ఉండడంతో కౌన్సెలింగ్ ప్రక్రియ జాప్యమైంది. దీంతో చాలామంది ఉపాధ్యాయులు నిరీక్షించారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్ ప్రక్రియ రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. కాగా తక్కువ జీతానికి పనిచేస్తున్న తమకు సుదూర ప్రాంతాల్లో కాకుండా సమీప మండలాల్లో పోస్టింగ్ ఇవ్వాలని ‘1998 -డీఎస్సీ’ ఉపాధ్యాయులు కోరారు. ‘జిల్లాలో ఎంటీఎస్ ఉపాధ్యాయుల బదీల కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 321 మంది ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించి.. కోరుకున్న స్థానాలు కేటాయించాం. ఉపాధ్యాయులు ఎవరికీ నష్టం జరగకుండా ఉండేందుకుగానూ మధ్యాహ్నం 2 గంటలకు కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టా మ’ని డీఈవో రవిబాబు తెలిపారు.