రాజీయే రాజమార్గం
ABN , Publish Date - Jun 21 , 2026 | 12:10 AM
కేసుల పరిష్కారానికి రాజీ మార్గమే రాజ మార్గమని జిల్లా ఫ్యామిలీ కోర్టు న్యాయాధికారి వివేకానంద శ్రీనివాస్ అన్నారు.
-ఎక్కువ కేసుల రాజీకి సహకరించాలి
- జిల్లా ఫ్యామిలీ కోర్టు న్యాయాధికారి వివేకానంద శ్రీనివాస్
నరసన్నపేట, జూన్ 20(ఆంధ్రజ్యోతి): కేసుల పరిష్కారానికి రాజీ మార్గమే రాజ మార్గమని జిల్లా ఫ్యామిలీ కోర్టు న్యాయాధికారి వివేకానంద శ్రీనివాస్ అన్నారు. శనివారం స్థానిక కోర్డు ఆవరణలో న్యాయవాదులు, పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్ అదాలత్లో ఎక్కువ కేసుల రాజీకి సహకరించాలని సూచించారు. ఇరు పక్షాల అంగీకారం మేరకు కేసులను రాజీ చేసుకోవడం ఉత్తమమని అన్నారు. అనంతరం సబ్ జైలును తనిఖీ చేసి ఖైదీలతో మాట్లాడి వారి యోగ క్షేమాలు, సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి, సివిల్ న్యాయాధికారి కె.హరిబాబు, స్థానిక కోర్డు న్యాయాధికారి ఎస్.వాణి పాల్గొన్నారు.
పాతపట్నం కోర్టులో..
పాతపట్నం, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో శనివారం బార్ అసోసియేషన్ సభ్యులు పాతపట్నం, సారవకోట, కోటబొమ్మాళి మండలాల పోలీస్ అధికారులతో సమా వేశం నిర్వహించారు. ఈసందర్భంగా న్యాయాధికారి వివేకానంద్ శ్రీనివాస్, లీగల్ సర్వీసెస్ అథారిటీ జిల్లా కార్యదర్శి కె.హరిబాబు మాట్లాడుతూ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులను రాజీ చేసేందుకు పలు సూచన లిచ్చారు. కక్షిదారులతో మాట్లాడి రాజీయే ఉత్తమ మార్గమని తెలియజేయాలని అన్నారు. అనంతరం స్థానిక సబ్ జైలును సందర్శిం చారు. వీరి వెంట స్థానిక జూనియర్ సివిల్ న్యాయాధికారి ఎం.రోషిణి, న్యాయవాదులు తదితరులు ఉన్నారు.
ఎక్కువ కేసులను పరిష్కరించండి
పలాస, జూన్ 20(ఆంధ్రజ్యోతి): వచ్చేనెల 11న జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని పలాస జూనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి యు. మాధురి కోరారు. శనివారం కోర్టు ఆవరణలో కాశీబుగ్గ, వజ్రపుకొత్తూరు పోలీసులు, ఎక్సైజ్ పోలీసులతో సమావేశం నిర్వహించారు. లోక్ అదాలత్లో క్రిమినల్ కేసులు రాజీ జరిగే విధంగా కృషి చేయాలన్నారు. కక్షిదారులకు ముందుగానే నోటీసులు అందజేశామని, ముందుగానే ప్రీ లోక్ అదాలత్ నిర్వహించి కేసులు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ, ఎస్ఐ నిహార్ తదితరులు పాల్గొన్నారు.