బీఆర్వో జవాన్ మృతి
ABN , Publish Date - Aug 13 , 2026 | 12:33 AM
హిమాచల్ప్రదేశ్లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో)లో 22 ఏళ్లుగా జవాన్గా విధులు నిర్వహిస్తున్న ఎంవీఎన్ గిరి (52) బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు.
తెల్లవారుజామున గుండెపోటు
నేడు స్వగ్రామానికి మృతదేహం
ఆమదాలవలస, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): హిమాచల్ప్రదేశ్లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో)లో 22 ఏళ్లుగా జవాన్గా విధులు నిర్వహిస్తున్న ఎంవీఎన్ గిరి (52) బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. గిరి మృతి చెందిన విషయం తెలిసి స్వగ్రామం తిమ్మాపురంలో విషాదచాయలు అలము కున్నాయి. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. తిమ్మాపురం గ్రామానికి చెందిన ఎంవీఎన్ గిరి హిమాచల్ ప్రదేశ్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లో డిఫెన్స్కు సంబంధించిన విధులు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున గుండెపోటులో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. ఈ మేరకు మృతదేహం గురువారం స్వగ్రామం రానున్నట్లు వారు తెలిపారు. గిరి మృతికి సంబంధించి ఆయన భార్య మామిడి హేమలత మనాలి పోలీస్స్టేషన్లో ఎస్హెచ్వోకు కన్సెంట్ లెటర్ అందించారు. తన భర్త మృతదేహానికి సివిల్ లేదా మిలటరీ అథారిటీ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని జి.శ్రీనివాసరావు, జేఈ, జీఎస్ 179985 వైకు అప్పగించేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆమె ఆ లేఖలో స్పష్టం చేశారు. మృతుడికి భార్య హేమలతతో పాటు ఇద్దరు పిల్లలున్నారు. గురువారం స్వగ్రామం రానున్న మృతదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అందరితో కలివిడిగా ఉండే గిరి మంచి వ్యక్తిగా పేరు ఉందని, ఆయన మృతి చెందారన్న విషయం తెలుసుకుని గ్రామస్థులు విచారం వ్యక్తంచేశారు.