నరసన్నపేటలో పశుమాంసం విక్రయాలు
ABN , Publish Date - Apr 22 , 2026 | 12:02 AM
VHP members block beef sales నరసన్నపేటలో పశుమాంస విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పురుషోత్తనగర్, రాజీవ్నగర్ కాలనీల్లోని ఇళ్లల్లో గుట్టుచప్పుడు కాకుండా చేపడుతున్న విక్రయాలను విశ్వహిందూ పరిషత్ సభ్యులు బయటపెట్టారు.
గుట్టుచప్పుడు కాకుండా రెండు కేంద్రాల్లో నిర్వహణ
అడ్డుకున్న వీహెచ్పీ సభ్యులు
పోలీసులకు ఫిర్యాదు
నరసన్నపేట, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): నరసన్నపేటలో పశుమాంస విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పురుషోత్తనగర్, రాజీవ్నగర్ కాలనీల్లోని ఇళ్లల్లో గుట్టుచప్పుడు కాకుండా చేపడుతున్న విక్రయాలను విశ్వహిందూ పరిషత్ సభ్యులు బయటపెట్టారు. ఈ కాలనీల్లో ఇద్దరు వ్యక్తులు కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్ల ఆవరణలో ఆవు, ఎద్దుల మాంసాన్ని విక్రయిస్తున్నట్టు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) సభ్యులకు సమాచారం అందింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి మాటువేసి విక్రయాల డెన్లను వారు గుర్తించారు. వెంటనే పోలీసులకు, పంచాయతీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ బి.గణేష్, వీహెచ్పీవీ సభ్యులు ఉణ్న వెంకటేశ్వరరావు, బంటుపల్లి సుమబాల, ఎం.సుధాకర్, టంకాల సూరప్పుడు, పి.రమేష్ తదితరులు ఆయా ఇళ్లలో పరిశీలించారు. రాజీవ్నగర్ కాలనీలో ఒక ఇంట్లో ఫ్రిజ్లో భారీస్థాయిలో ఆవు, ఎద్దు మాంసం నిల్వలు బయటపడ్డాయి. పురుషోత్తనగర్లోని మరొక ఇంట్లో 20 కేజీల మాంసం ఉన్నట్లు గుర్తించారు. ఆవుమాంసం విక్రయించినవాపై చర్యలు తీసుకోవాలని వీహెచ్పీవీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ గణేష్ తెలిపారు.
స్థానిక నాయకుల అండతో..
నరసన్నపేటలో కొన్నాళ్ల కిందట గోవధ చేపడుతూ మాంసాన్ని ఇతర ప్రాంతాలకు తరలించేవారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత దీనిపై దృష్టి సారించడంతో పచోరికాలనీలో గోవధశాల మూతపడింది. దీంతో గోవధ శాల నిర్వాహకుడు తన మకాంను రాజీవ్నగర్, పురుషోత్తనగర్కు మార్చారు. ఎవరికీ అనుమానం రాకుండా పెద్దపెద్ద బ్యాగ్లలో మాంసాన్ని తీసుకువచ్చి.. కిలో ప్యాకెట్లుగా తయారు చేసి డోర్ డెలివరీ చేపడుతున్నారు. ఉదయం 12 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, రాత్రి 6 గంటల నుంచి 8 గంటలు వరకు బిర్యానీ పేరిట అమ్మకాలు సాగిస్తున్నారు. శ్రీకాకుళంలోని నానుబాలవీధిలో ఉంటున్న కొందరు నరసన్నపేట నుంచి గోమాంసంను తీసుకెళ్తున్నట్టు సమాచారం. గ్రామ పంచాయతీ గత పాలకవర్గంలోని కొంతమంది సభ్యుల కనుసన్నల్లో ఈ వ్యాపారం సాగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి.