జీడీపీ సాధనలో బ్యాంకర్లే కీలకం
ABN , Publish Date - Mar 25 , 2026 | 11:58 PM
Let's achieve goals జిల్లా స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు ప్రధానపాత్ర వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లాలోని 3వ త్రైమాసికానికి సంబంధించిన జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని.. జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి వర్చువల్గా నిర్వహించారు.
సమన్వయంతో లక్ష్యాలు సాధిద్దాం
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, మార్చి 25(ఆంధ్రజ్యోతి): జిల్లా స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు ప్రధానపాత్ర వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లాలోని 3వ త్రైమాసికానికి సంబంధించిన జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని.. జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి వర్చువల్గా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ‘జిల్లా అభివృద్ధి వేగవంతం కావాలంటే.. వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం, స్వయంఉపాధి పథకాలకు బ్యాంకులు సకాలంలో రుణాలు మంజూరు చేయాలి. పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ, పీఎం విశ్వకర్మ, పీఎం సూర్యఘర్, స్వయం సహాయక సంఘాలు, వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించిన రుణాల మంజూరులో జాప్యం వద్దు. బ్యాంకులు, వివిధ శాఖలు సమన్వయంతో పనిచేస్తే జీడీపీ లక్ష్యాలను సులభంగా సాధించవచ్చ’ని తెలిపారు. నాబార్డు అంచనాల ప్రకారం 2026-27కి సంబంధించి జిల్లా రుణ అవసరాలు రూ.13,526.92 కోట్లుగా అంచనా వేశారు. సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ పేడాడ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ జేడీ త్రినాథస్వామి, డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్, మెప్మా పీడీ వెంకటరావు, మత్స్యశాఖ డీడీ సత్యనారాయణ, నాబార్డు మేనేజర్ రమేష్కృష్ణ, రాకేష్ కృష్ణ, బ్యాంకుల కంట్రోలర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
22-ఏ భూ సమస్యలు సత్వరమే పరిష్కరించండి
జిల్లాలోని 22-ఏ భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తహసీల్దార్లను ఆదేశించారు. బుధవారం జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి ఆయన జిల్లాలోని తహసీల్దార్లతో వర్చువల్ సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా ఎన్ని 22-ఏ భూ సమస్యలు పెండింగ్లో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్డీవోలు, తహసీల్దార్లు, కలెక్టరేట్ పరిపాలనాధికారి, డీటీలు పాల్గొన్నారు.