టెట్కు సర్వం సిద్ధం
ABN , Publish Date - Aug 03 , 2026 | 12:16 AM
Tet from 5 to 16 ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఈ నెల 5 నుంచి పరీక్షల నిర్వహణకు రంగం సిద్ధం చేశారు. ఏడు కేంద్రాల్లో 12,690 మంది అభ్యర్థులు టెట్ రాయునున్నారు. వీరికి ప్రభుత్వ షెడ్యూల్ మేరకు ఈ నెల 5 నుంచి 16 వరకు ఆన్లైన్ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తారు.
5 నుంచి 16 వరకు పరీక్షలు
12,690 మంది అభ్యర్థుల దరఖాస్తు
జిల్లాలో నాలుగు, ఒడిశాలో మూడు కేంద్రాల కేటాయింపు
శ్రీకాకుళం ఎడ్యుకేషన్, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఈ నెల 5 నుంచి పరీక్షల నిర్వహణకు రంగం సిద్ధం చేశారు. ఏడు కేంద్రాల్లో 12,690 మంది అభ్యర్థులు టెట్ రాయునున్నారు. వీరికి ప్రభుత్వ షెడ్యూల్ మేరకు ఈ నెల 5 నుంచి 16 వరకు ఆన్లైన్ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తారు. నరసన్నపేటలో కోర్ టెక్నాలజీ, ఎచ్చెర్లలో శివానీ, శ్రీవెంకటేశ్వర, టెక్కలిలో ఐతం ఇంజనీరింగ్ కళాశాలతోపాటు ఒడిశా రాష్ట్రం బరంపురంలో మూడు కేంద్రాలను పరీక్షలకు కేటాయించారు. ఈ ఏడు కేంద్రాలకు డీవోలతో పాటు రెండు ఫ్లయింగ్ స్కాడ్ను నియమించారు. పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు సులభంగా చేరుకునేందుకు ప్రజారవాణా వ్యవస్థ అధికారులకు సమాచారం తెలియజేసారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్యఆరోగ్య శిబిరాలు, నిరంతర విద్యుత్ సరఫరా కు ఏర్పాట్లు చేపట్టారు. ఈసారి ఇన్సర్వీసు టీచర్లు అధికంగా దరఖాస్తు చేసుకున్నారని, నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహిస్తామని డీఈవో ఏ.రవిబాబు పరీక్షల సహాయ కమిషనర్ చంద్రభూషణరావు తెలిపారు.
ఇన్సర్వీసు టీచర్లూ రాయాల్సిందే
విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చిన తర్వాత 2011 నుంచి డీఎస్సీ రాయాలంటే టెట్ పాస్ తప్పనిసరి చేశారు. ఈనేపథ్యంలో బీఈడీ, టీటీసీ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు టెట్ రాస్తున్నారు. కొన్నేళ్ల వరకు ఉపాధ్యాయ, ఉద్యోగార్థులకు మాత్రమే ఈ నిబంధన విధించారు. ప్రస్తుతం ఇన్సర్వీస్ టీచర్లు కూడా తప్పనిసరిగా టెట్ పాస్ కావాలనే నిబంధన పెట్టారు. ఇతర రాష్ట్రాల్లో కొందరు టీచర్లు టెట్ మినహాంపుపై సుప్రీంకోర్డుకు వెళ్లినా ఊరట దొరకలేదు. విద్యాహక్కు చట్టం మేరకు ప్రతీ టీచర్ తప్పనిసరిగా టెట్ పాసై ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పు వెలువడే నాటికి ఐదేళ్లలోపు ఉద్యోగ విరమణ పొందేవారిని మినహాయించింది. మిగిలిన ఇన్సర్వీసు టీచర్లందరూ 2028 ఆగస్టులోగా టెట్ పాస్ కావాలని, లేదంటే ఉపాధ్యాయ ఉద్యోగాలకు అనర్హులుగా పరిగణింపబడతారని స్పష్టం చేసింది. దీంతో ఇన్సర్వీస్ టీచర్లు కూడా టెట్కు దరఖాస్తు చేసుకున్నారు.