ఇక జిల్లా పరిధిలోనే టీచర్ల సర్దుబాటు!
ABN , Publish Date - May 11 , 2026 | 12:25 AM
The process of division in the education department ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖలో విభజన ప్రక్రియ మొదలైంది. ఇప్పటివరకూ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాలో విద్యాశాఖ కార్యాలయాలున్నా, టీచర్ల సర్వీసు అంశాలకు సంబంధించి ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ఆధారంగానే నిర్వహిస్తున్నారు.
విద్యాశాఖలో మొదలైన విభజన ప్రక్రియ
నెలాఖరులోగా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు
ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ
నరసన్నపేట, మే 10(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖలో విభజన ప్రక్రియ మొదలైంది. ఇప్పటివరకూ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాలో విద్యాశాఖ కార్యాలయాలున్నా, టీచర్ల సర్వీసు అంశాలకు సంబంధించి ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ఆధారంగానే నిర్వహిస్తున్నారు. నియామకాలు, బదిలీలు, సర్దుబాట్లు, డీఎస్సీ, పరీక్షలు, కౌన్సెలింగ్ ఇలా అన్ని ప్రక్రియలు శ్రీకాకుళం, విజయనగరంలో జరిగేవి. ఈ విద్యా సంవత్సరం(2026-27) నుంచి కొత్త జిల్లాల ప్రాతిపదికన పాలన జరుగుతుంది. ఈ క్రమంలోనే తొలుత జిల్లా పరిధిలోనే ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకోసం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల విద్యాశాఖ ఏడీలను నోడల్ అధికారులుగా నియమిస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. నెలాఖరులోపు సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేస్తే జూన్ లేదా జూలైలో పునర్విభజన.. జిల్లాల ప్రాతిపదికన విద్యాశాఖ పాలన మొదలవుతుంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని రాజాం నియోజకవర్గంలో రాజాం, వంగర, సంతకవిటి, రేగిడి మండలాలు విజయనగరం జిల్లాలోని విద్యాశాఖ కార్యాలయంలో విలీనం కానున్నాయి. పాలకొండ నియోజకవర్గంలోని పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టం మండలాలు పార్వతీపురం జిల్లాలోని విద్యాశాఖ కార్యాలయంలో విలీనమవుతాయి.
జిల్లాలో 2,612 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదోతరగతి వరకు 1,59,638 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 13వేల మందికి పైగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. రాజాం, పాలకొండ నియోజకవర్గాల్లో ఉన్న సుమారు 4వేల మంది ఉపాధ్యాయులకు కొత్త జిల్లాల ప్రాతిపదికన సర్దుబాటు చేసేందుకు విద్యాశాఖ గెజిట్ జారీ చేసింది.
సర్దుబాటు ఇలా ..
స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ)ను డివిజన్ స్థాయిలో సర్దుబాటు చేస్తారు. ఉమ్మడి జిల్లా ఆధారంగా చేస్తే పక్క డివిజన్లోనూ కేటాయిస్తారు. అవసరాన్ని బట్టి సెకండరీ గ్రేడ్ టీచర్లను అదే మండలం లేదంటే పక్క మండలంలో సర్దుబాటు చేస్తారు. గ్రేడ్-2 హెడ్మాస్టర్లను కూడా జోనల్స్థాయిలో కేటాయిస్తారు. 40 నుంచి 50 మంది లోపు విద్యార్థులున్న మోడల్ ప్రైమరీ స్కూళ్లకు మూడు పోస్టులు కేటాయిస్తారు. వీరి సీనియారిటీ ఆధారంగా అదే మండలంలో కానీ, పక్క మండలాల్లో కానీ సర్దుబాటు చేస్తారు. పదిమంది లోపు విద్యార్థులున్న పాఠశాలల టీచర్లు, విద్యార్థుల విషయంలో షెడ్యూల్ ఏరియాలో ఉంటే పాఠశాల విలీనం చేయరు. రాష్ట్రస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు సమన్వయంతో ఆన్లైన్ /ఆప్లైన్ ద్వారా ఖాళీలు, అదనపు సిబ్బంది వివరాలు సేకరిస్తారు. వీటిని ధ్రువీకరించి తుది జాబితా ఆధారంగా బదిలీలు, నియామకాలు చేపడతారు.