పకడ్బందీగా
ABN , Publish Date - May 15 , 2026 | 12:23 AM
CM's tour schedule released నరసన్నపేటలో ఈనెల 16న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి వెల్లడించారు. గురువారం నరసన్నపేటలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏర్పాట్లు, సభా ప్రాంగణం, తామరాపల్లి వద్ద హెలీప్యాడ్ పనులను ఆయన పరిశీలించారు.
నరసన్నపేటలో సీఎం పర్యటనకు చురుగ్గా ఏర్పాట్లు
టూర్ షెడ్యూల్ విడుదల
రూట్మ్యాప్పై ట్రయల్రన్
కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే పరిశీలన
నరసన్నపేట, మే 14(ఆంధ్రజ్యోతి): నరసన్నపేటలో ఈనెల 16న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి వెల్లడించారు. గురువారం నరసన్నపేటలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏర్పాట్లు, సభా ప్రాంగణం, తామరాపల్లి వద్ద హెలీప్యాడ్ పనులను ఆయన పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. నరసన్నపేట మేజర్ పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ముఖ్యమంత్రి రాకతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంద’ని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే సీఎం పర్యటన ఏర్పాట్లను జడ్పీ సీఈవో వెంకట్రామన్, డీపీవో స్వరూపరాణి పరిశీలించారు.
భద్రతా ఏర్పాట్లు పరిశీలన
సీఎం పర్యటన నేపథ్యంలో భధ్రతా ఏర్పాట్లపై అధికార యంత్రాంగం అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ నిర్వహించింది. గురువారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్ భధ్రతా అధికారులతో కలిసి పర్యటన రూట్ మ్యాప్ను నిశితంగా పరిశీలించారు. తామరాపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలీపాడ్ నుంచి నరసన్నపేట ప్రజావేధిక స్ధబాస్థలి వరకు అక్కడి నుంచి ఘన వ్యర్థాల నిర్వహాణ కేంద్రం వరకు అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. సీఎం భద్రతా విభాగం ఏఎస్పీ కృష్ణరావు, డీఎస్పీ బి.రాజ్కుమార్ నేతృత్వంలో బృందం భద్రతా పరమైన అంశాలపై స్థానిక అధికారులకు పలు సూచనలు చేసింది.
సభకు వచ్చే ప్రజల ప్రవేశమార్గాలు, వాహనాలు పార్కింగ్, సెక్యూరిటీ చెక్పాయింట్లు, వైద్య శిబిరాల ఏర్పాటుపై కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టబందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆదేశించారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు తాగునీరు, నీడ సౌకర్యం కల్పించాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో స్వప్నిల్ పవర్ జగన్నాథ్, శ్రీకాకుళం, టెక్కలి ఆర్డీఈవోలు వేణుగోపాల్, కృష్ణమూర్తి, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డా.అనిత, పీఆర్ ఎస్ఈ వీరన్నాయుడు, ఆర్అండ్బీ ఎస్ఈ సత్యనారాయణ పాల్గొన్నారు.
రాజుల చెరువును పరిశీలించిన జేసీ
నరసన్నపేటలో రాజులు చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకుగాను జేసీ ఫర్మాన్ అహ్మాద్ఖాన్ పరిశీలించారు. రాజుల చెరువు వివరాలను రెవెన్యూ అధికారులకు అడిగి తెలుసుకున్నారు. సీఎంవో కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ చెరువుపై సీఎం చంద్రబాబుకు నివేదిక అందజేయనున్నారు. అలాగే తామరాపల్లి వద్ద హెలీప్యాడ్ పనులను జేసీ పరిశీలించారు. డంపింగ్ యార్డు వద్ద ఏర్పాటు చేసిన చేలింగ్ యంత్రం పనితీరుపై మహిళా సంఘాల ప్రతినిధులకు అవగాహన నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆర్.సత్యనారాయణ, ఈవో ద్రాక్షాయణి, నిశ్చల పాల్గొన్నారు.
పర్యటన షెడ్యూల్ ఇలా
నరసన్నపేటలో సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 16న ఉదయం 9 గంటలకు ఉండవల్లిలో బయలుదేరి.. హెలీకాప్టర్లో ఉదయం 10.40 గంటలకు తామరాపల్లి హెలీప్యాడ్వద్దకు చేరుకుంటారు.
ఉదయం 10.55 వరకు హెలీప్యాడ్ వద్ద వినతులు స్వీకరిస్తారు
ఉదయం 11 గంటలకు నరసన్నపేటలో సభా స్థలానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.45 గంటల వరకు ప్రజావేదిక సమావేశంలో పాల్గొంటారు
తర్వాత 1.15 గంటల వరకు రిజర్వుగా ఉంటారు.
మధ్యాహ్నం 1.20 గంటలకు నరసన్నపేట మెయిన్ రోడ్డుమీదుగా చెత్త సంపద కేంద్రానికి(ఎస్డబ్ల్యూపీసీ) చేరుకుంటారు.
మధ్యాహ్నం 2.05 గంటల వరకు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.
మధ్యాహ్నం 2.10 నుంచి 3.40 గంటల వరకు తామరాపల్లి వద్ద హెలీప్యాడ్కు సమీపంలో క్యాడర్తో సమావేశం నిర్వహిస్తారు.
3.55 గంటలకు హెలీకాప్టర్లో బయలుదేరి.. ఉండవల్లికి తిరుగుపయనమవుతారు.