మాస్టారుకు ‘పూలరథం’
ABN , Publish Date - Apr 25 , 2026 | 12:01 AM
A grand procession for Venkateswara Rao ఆ ఊరిలోనే పుట్టిపెరిగారు. అక్కడే ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ.. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ.. ఎంతోమందిని ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఈ నెలాఖరున సొంత ఊరిలోనే పదవీ విరమణ చేయనున్న ఆ మాస్టారును గ్రామస్థులు, ప్రస్తుత, పూర్వ విద్యార్థులు ‘పూలరథం’పై ఊరేగించి అభిమానాన్ని చాటుకున్నారు.
వేంకటేశ్వరరావుకు ఘనంగా ఊరేగింపు
పొందూరు, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): ఆ ఊరిలోనే పుట్టిపెరిగారు. అక్కడే ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ.. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ.. ఎంతోమందిని ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఈ నెలాఖరున సొంత ఊరిలోనే పదవీ విరమణ చేయనున్న ఆ మాస్టారును గ్రామస్థులు, ప్రస్తుత, పూర్వ విద్యార్థులు ‘పూలరథం’పై ఊరేగించి అభిమానాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పదవీ విరమణ వేళ పొందూరు మండలం లైదాం గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు బలివాడ వేంకటేశ్వరరావును గ్రామస్థులు పూలరథంతో ఊరేగించారు. వేంకటేశ్వరావు మాస్టారు ప్రస్తుతం లైదాంలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. ఈ పాఠశాలలో 2002 నుంచి 2011 వరకు పనిచేసి.. బదిలీపై వెళ్లారు. మళ్లీ 2017 జూన్లో ఇదే పాఠశాలకు బదిలీపై వచ్చి.. ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నారు. గతంలో క్లస్టర్, పొందూరు మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందారు. ఆయన వద్ద చదువుకున్న విద్యార్థుల్లో చాలామంది ఉపాధ్యాయులుగా, ఆర్మీ, బ్యాంకు, రైల్వే తదితర రంగాల్లో ఉన్నతస్థాయిలో ఉన్నారు. కాగా.. ఈ నెల 30న వేంకటేశ్వరరావు మాస్టారు పదవీ విరమణ చెందనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత, పూర్వ విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, గ్రామస్థులు శుక్రవారం ఆయనను పూలతో అలంకరించిన రథంలో ఊరేగించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఘనంగా సన్మానించారు. మాస్టారు సేవలను గుర్తుచేసుకున్నారు.