గ్రూపు-2లో రాణించిన యువత
ABN , Publish Date - Jan 29 , 2026 | 02:44 AM
ల్లాకు చెందిన యువకులు గ్రూపు-2లో రాణించారు. పలు కీలక ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అలా ఎంపికైన వారిలో అధికులు ఇప్పటికే చిరుద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు.
పలు పోస్టులకు జిల్లావాసుల ఎంపిక
విజేతలంతా చిరుద్యోగాలు చేస్తున్నవారే
ఒంగోలు, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు చెందిన యువకులు గ్రూపు-2లో రాణించారు. పలు కీలక ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అలా ఎంపికైన వారిలో అధికులు ఇప్పటికే చిరుద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు. రాష్ట్రంలో రెండేళ్ల క్రితం గ్రూపు-2 పరీక్షలు జరిగాయి. అప్పట్లో పెద్దసంఖ్యలోనే అభ్యర్థులు హాజరయ్యారు. వివిధ కారణాలతో వాటి ఫలితాలు వాయిదా పడుతూ వచ్చాయి. ఎట్టకేలకు ఉద్యోగాలకు ఎంపికైన వారి వివరాలను ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. ఏపీ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జరిగాయి. తాజాగా వెల్లడించిన ఫలితాల్లో జిల్లావాసులు రాణించి పలు గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికయ్యారు. గ్రూపు-2లో కీలకంగా భావించే డిప్యూటీ తహసీల్దార్లు, సెక్రటరేయట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, మునిసిపల్ కమిషనర్, ఎక్సైజ్లో ఎస్ఈ వంటి ఉద్యోగాలు సాధించారు. వారిలో అధికులు ఉపాధ్యాయులుగా, గ్రామపంచాయతీ, సచివాలయ ఉద్యోగులుగా, పోలీస్ కానిస్టేబుళ్లుగా, రెవెన్యూలో చిన్నస్థాయి ఉద్యోగులుగా ఉన్నారు. వారంతా పట్టుదలతో చదివి గ్రూపు-2 కొలువులు సాధించారు. భవిష్యత్లో వారు ఉద్యోగోన్నతుల ద్వారా ఆయా శాఖల్లో అధికారులుగా ఎదిగే అవకాశం ఉండనుంది.