మహిళల భద్రత, ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ప్రాధాన్యం
ABN , Publish Date - Mar 08 , 2026 | 11:24 PM
మహిళల భద్రతకు, వారి ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డీఎ్సబీవీ స్వామి చెప్పారు.
ఒంగోలులో ఘనంగా మహిళా దినోత్సవం
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి స్వామి, ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే జనార్దన్, కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు కలెక్టరేట్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి) : మహిళల భద్రతకు, వారి ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డీఎ్సబీవీ స్వామి చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఒంగోలులోని బృందావనం కల్యాణ మండపంలో జరిగిన జిల్లా స్థాయి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. మహిళలను అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న సమర్థ చర్యల వల్ల మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా విశాఖపట్నం గుర్తింపు వచ్చిందన్నారు. కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మహిళలు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ మహిళలు స్వయంశక్తితో ఎదిగేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళలు తమ అనుభవాలను పంచుకున్నారు. అతిథులు మెప్మా ఆధ్వర్యంలో రూ.18.60 కోట్లు, డీఆర్డీఏ ఆధ్వర్యంలో రూ.314.61 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.67.28 కోట్ల విలువైన బ్యాంకు చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం రాయితీపై మంజూరు చేసిన ఒక ట్రాక్టర్, మూడు ఆటోలను కూడా అందజేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, మాలకార్పొరేషన్ చైర్మన్ విజయకుమార్, ఒంగోలు ఆర్బన్డెవల్పమెంట్ అథారిటి చైర్మన్ షేక్ రియాజ్, జిల్లా రెవెన్యూ అధికారి చినఓబులేశు, ఆర్డీవో లక్ష్మీప్రసన్న, డీఆర్డీఏ పీడీ నారాయణ, వివిధ శాఖల అధికారులు కళావతి, రమేష్, అర్జున్నాయక్, నాగమణి, డాక్టర్ టి.వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, రాజరాజేశ్వరి, వరలక్ష్మీ, పద్మశ్రీ, ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు.