ఎప్పుడిస్తారో..!
ABN , Publish Date - Jul 28 , 2026 | 03:10 AM
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు ప్రకటించిన ఎన్టీఆర్ బేబీ కిట్ల కోసం ఎదురుచూపులే మిగిలాయి. గత ఏడాది జూన్లో వీటిని అందించనున్నట్లు ప్రభుత్వం చెప్పింది. నేటికీ వైద్యశాలలకు కిట్లు చేరలేదు.
‘ఎన్టీఆర్ బేబీ కిట్’ల కోసం ఎదురుచూపులు
ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాలు పెంచేలా దృష్టి
తల్లీబిడ్డ ఆరోగ్యంపై ఏడాది క్రితం ప్రభుత్వం ప్రకటన
నేటికీ ఆసుపత్రులకు చేరని సామగ్రి
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు ప్రకటించిన ఎన్టీఆర్ బేబీ కిట్ల కోసం ఎదురుచూపులే మిగిలాయి. గత ఏడాది జూన్లో వీటిని అందించనున్నట్లు ప్రభుత్వం చెప్పింది. నేటికీ వైద్యశాలలకు కిట్లు చేరలేదు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పొందే పేద, మధ్యతరగతి వర్గాలకు ఆర్థికభారం పెరుగుతోంది. ప్రభుత్వం 11రకాల వస్తువులను అందించనున్నట్లు తెలపగా, ప్రస్తుతం అవి లభించకపో వడంతో ప్రైవేటుగా బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో ఒక్కొక్కరు రూ.1,500 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే కిట్లు వచ్చేలా చూడాలని వారు కోరుతున్నారు.
ఒంగోలు కార్పొరేషన్, జూలై 27 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు కూట మి సర్కారు గత ఏడాది జూన్లో పసిబిడ్డలకు అవ సరమైన సామగ్రి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోపురుడు పోసుకున్న ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ బేబీ కిట్లు అందించేలా చర్యలు చేపట్టింది. 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ విధానం అమలు చేశారు. ఆ తర్వా త అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ పథ కాన్ని తొలగించడంతోపాటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించేతల్లుల పట్ల నిర్లక్ష్యం వహించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథ కాన్ని పునరుద్ధరించాలని భావించింది. అయితే నేటికీ ప్రభుత్వ ఆసుపత్రులకు బేబీ కిట్లు రాకపోవడంతో గర్భిణులు, ప్రసవాలు జరిగిన తల్లులకు ఎదురు చూపులే మిగిలాయి.
కిట్లో 11 రకాల వస్తువులు
ప్రభుత్వం ప్రకటించిన ఒక్కో ఎన్టీఆర్ బేబీ కిట్ ఖరీదు సుమారు రూ.1,410 ఉంటుంది. అందులో పురిటి బిడ్డలు సుఖంగా నిద్రించేందుకు బెడ్, దోమతెర, తల్లులు చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్, బేబీ సబ్బు, న్యాప్కిన్, పౌడర్, రెండు టవల్స్, చిన్నబొమ్మ వంటి 11 రకాల వస్తువులు ఉంటాయి. వీటిని బయట కొనుగోలు చేయాలంటే సుమారు రూ.1,500 చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే పేదవారికి ఎన్టీఆర్ బేబీ కిట్లు ఆరోగ్యకరమైన వనరులుగా మారుతాయని అందరూ భావించారు.
ఉమ్మడి జిల్లాలో నెలకు 1,500 ప్రసవాలు
ఉమ్మడి జిల్లాలోని ఒంగోలులో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్), మార్కాపురంలో జిల్లా వైద్యశాల ఉంది. ప్రైమరీ హెల్త్ సెంటర్లు 89, కమ్యూనిటీ హెల్త్సెంటర్లు తొమ్మిది వరకు ఉన్నాయి. వాటితోపాటు ఏరియా ఆసుపత్రులు మరో తొమ్మిది నడుస్తున్నాయి. ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకు సుమారు 1,500 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. వారిలో అత్యధికశాతం మంది నిరుపేదలే. బిడ్డపుట్టగానే పరిశుభ్రమైన వస్త్రాల్లో ఉంచి సంరక్షణ చర్యలు చేపట్టాలి. లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రసూతి వైద్యంపై నిర్లక్ష్యం చూపడంతో శిశుమరణాలు కూడా నమోదైన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం శిశు మరణాలు తగ్గించడంతోపాటు, తల్లుల ఆరోగ్యంపైన ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బేబీ కిట్లు అందజేసి, తల్లీబిడ్డకు సంరక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా వైద్యారోగ్య శాఖ అధికారులు కిట్లను అందించే దిశగా ప్రభుత్వానికి నివేదికలు పంపాలని పలువురు కోరుతున్నారు.