పెళ్లి బృందానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
ABN , Publish Date - Aug 28 , 2026 | 10:55 PM
పెళ్లి బృందానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న టెంపో ముందు టైరు పగిలిపోవడంతో డివైడర్ మధ్యలో ఉన్న సిమెంట్ దిమ్మెను ఢీకొట్టడంతో వాహనం ముందుభాగం నుజ్జునుజ్జయింది.
మచిలీపట్నం నుంచి తిరుమలకు టెంపోలో బయల్దేరిన కుటుంబ సభ్యులు
ముందు టైరు పగిలిపోవడంతో సిమెంట్ దిమ్మెను ఢీకొట్టిన వాహనం
ఆరుగురికి స్పల్ప గాయాలు
ఎమర్జెన్నీ రన్వేపై మూలగుంటపాడు పోలేరమ్మ గుడి సమీపంలో సంఘటన
సింగరాయకొండ, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి) : పెళ్లి బృందానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న టెంపో ముందు టైరు పగిలిపోవడంతో డివైడర్ మధ్యలో ఉన్న సిమెంట్ దిమ్మెను ఢీకొట్టడంతో వాహనం ముందుభాగం నుజ్జునుజ్జయింది. అందులో 11 మంది ప్రయాణిస్తుండగా ఆరుగురికి స్పల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన స్థానిక రన్వేపై మూలగుంటపాడు పోలేరమ్మ గుడి సమీపంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణా జిల్లా గూడూరుకి చెందిన వారు వివాహం చేసుకోవడానికి మచిలీపట్నం నుంచి తిరుమలకు టెంపోలో బయల్దేరారు. సింగరాయకొండ ఎమర్జెన్సీ ల్యాండింగ్ వద్దకు చేరుకునేసరికి అకస్మాత్తుగా వాహనం ముందు టైరు పగలడంతో అదుపుతప్పి డివైడర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెళ్లి కుమారుడు శ్రీనివాసరావు, పెళ్లి కుమార్తె రోహితతో పాటు మరో నలుగురికి స్పల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే మొబైల్ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాలత్రులను వెంటనే హైవే అంబులెన్స్, 108 వాహనాల్లో ఒంగోలు రిమ్స్కి తరలించారు. ఎస్సై సుధీర్కుమార్ ప్రమాదస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నానికి క్షతగాత్రులు డిశ్చార్జ్ అయి మరో వాహనంలో తిరుమలకు బయల్దేరారు.