‘ఉపాధి’ సిబ్బంది రచ్చ
ABN , Publish Date - May 19 , 2026 | 03:11 AM
ఉపాధి హామీ పథకంలో చోటుచేసుకుంటున్న అవినీతి బహిర్గతమైంది. లంచాల ద్వారా దండుకున్న డబ్బు పంపిణీ విషయమై సిబ్బంది మధ్య విభే దాలు తారస్థాయికి చేరాయి. సోమవారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఫీల్డ్ అసిస్టెంట్, టీఏ, ఏపీవో రచ్చ చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.
కూలీల వద్ద అక్రమంగా వసూలు చేసిన డబ్బుల పంపకాల్లో విభేదాలు
కార్యాలయ ఆవరణలో వాగ్వివాదం
పనులు చేసిన వారికి అందని వేతనాలు
పొదిలి, మే 18 (ఆంధ్రజ్యోతి) : ఉపాధి హామీ పథకంలో చోటుచేసుకుంటున్న అవినీతి బహిర్గతమైంది. లంచాల ద్వారా దండుకున్న డబ్బు పంపిణీ విషయమై సిబ్బంది మధ్య విభే దాలు తారస్థాయికి చేరాయి. సోమవారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఫీల్డ్ అసిస్టెంట్, టీఏ, ఏపీవో రచ్చ చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. దండుకున్న డబ్బుల్లో వాటా ఇవ్వలేదని ఏపీవో బిల్లులు అప్లోడ్ చేయలేదు. దీంతో కూలీలకు కూలి చెల్లింపులు నిలిచిపోయాయి. గ్రామాల్లో కూలీలు ఉపాధి సిబ్బందిని నిలదీస్తున్నారు. వారానికి రూ.200 చొప్పున మా వద్ద లంచం తీసుకుని కూలి ఎందుకు చెల్లించడం లేదని ఆగ్రహిస్తున్నారు. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్, టీఏ సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని ఆఫీసులో ఏపీవోను ప్రశ్నించారు. దీంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. కూలీల వద్ద వసూలు చేసిన డబ్బును క్షేత్ర సహాయకుడు, సాంకేతిక సిబ్బంది పంచుకుంటూ ఏపీవోకు వాటా ఇవ్వకపోవడంతోనే బిల్లుల అప్లోడ్లో తాత్సారం చేసినట్లు తెలిసింది. మొత్తంమీద మండలంలో ఉపాధి హామీ పనుల్లో జరుగుతున్న అవినీతి అంతాఇంతా కాదని పలువురు విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని కోరుతున్నారు.