గిరిజనులు హక్కులపై అవగాహన కలిగి ఉండాలి
ABN , Publish Date - Sep 20 , 2026 | 03:05 AM
గిరిజనులు చట్టబద్ధమైన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎ.సత్యానంద్ అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన న్యాయ సేవా సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
న్యాయ సేవా సదస్సులో ప్రకాశం జిల్లా న్యాయాధికారి సత్యానంద్
అక్షరాస్యతతోనే చైతన్యం : మార్కాపురం కలెక్టర్ విజయసునీత
పెద్దదోర్నాల, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : గిరిజనులు చట్టబద్ధమైన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎ.సత్యానంద్ అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన న్యాయ సేవా సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలోని ప్రజలకు ఉచిత న్యాయం అందించేందుకు అత్యున్నతమైన వ్యవస్థలు పనిచేస్తున్నాయని తెలిపారు. అందులో భాగంగా మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులకు సైతం అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో ఎవరూ నష్టపోకూడదన్నారు. సుప్రీం కోర్టు పరిధిలో నాల్సా, రాష్ట్ర స్థాయిలో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ప్రతి జిల్లా కోర్టు హెడ్ క్వార్టర్స్లో జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థలు అందుబాటులో ఉన్నాయన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మార్కాపురం కలెక్టర్ విజయసునీత మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసిన సంక్షేమ పథకాలు పొందాలంటే అవగాహన అవసరమన్నారు. అక్షరాస్యతతోనే చైతన్యం కలుగుతుందన్నారు. గిరిజనులు విధిగా పిల్లలను చదివించాలని కోరారు. తొలుత జిల్లా న్యాయా ధికారి సత్యానంద్, కలెక్టర్ విజయసునీత.. అటవీ, జీసీసీ, అంగన్వాడీ, వైద్యారోగ్యశాఖ, డ్వామా, వెలుగు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా గిరిజన బాలికలు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. మార్కాపురం 6వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయాధికారి వి.భవాని అధ్యక్షతన జరిగిన సదస్సులో మార్కాపురం అదనపు న్యాయా ధికారి బాలాజీనాయక్, డీఎస్పీ నాగరాజు, ఆర్డీవో వెంకటశివరామిరెడ్డి, సివిల్ న్యాయాధికారి రామకృష్ణ, దేవేంద్రరెడ్డి పాల్గొన్నారు.