పొలాల్లో పులి సంచారం
ABN , Publish Date - Mar 01 , 2026 | 03:10 AM
మండలంలోని గడ్డమీదపల్లి గ్రామ సమీపంలోని పంట పొలాల్లో పెద్ద పులి సంచరించినట్లు రైతులు గుర్తించారు. శనివారం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
భయాందోళనలో ప్రజలు
ఎర్రగొండపాలెం రూరల్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని గడ్డమీదపల్లి గ్రామ సమీపంలోని పంట పొలాల్లో పెద్ద పులి సంచరించినట్లు రైతులు గుర్తించారు. శనివారం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు, ఫారెస్టు అధికారులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి 2 కిలో మీటర్ల దూరంలో అటవీ ప్రాంత సమీపంలో రైతుల పొలాల్లోకి నీటి కోసం పులి రెండు రోజులుగా వస్తోంది. దాని పాదముద్రలను చూసిన రైతులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ఆ ప్రాంతానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. చుట్టుపక్కల 10 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని చెప్పారు. రైతులకు తోడుగా సిబ్బంది ఆ ప్రాంతంలో ఉన్నట్లు రేంజర్ ప్రసన్న జ్యోతి తెలిపారు. ఆర్ధరాత్రి దాటాకా కెమెరాలో చిక్కితే ఆ ప్రాంతంలో ఉన్నట్లని, లేదంటే అటవీ ప్రాంతానికి వెళ్లినట్లేనని తెలిపారు. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రసన్న జ్యోతి సూచించారు.