ఆ ముగ్గురి ప్రతిఘటనే నాకు స్ఫూర్తి
ABN , Publish Date - Feb 07 , 2026 | 12:36 AM
‘గుండె ధైర్యానికితోడు సమయస్ఫూర్తి ఉంటే ఎంతటి క్లిష్టపరిస్థితితినైనా ఎదుర్కోవచ్చు.. అందుకు నాడు అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులు గొట్టిపాటి, స్వామి, ఎమ్మెల్యే ఏలూరి చూపిన తెగువే నిదర్శనం.. అదేనాకు స్ఫూర్తినింపింది.. మీకూ స్ఫూర్తి కావాలి’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లో కేష్ భావోద్వేగ ప్రసంగం చేశారు.
గొట్టిపాటి, స్వామి, ఏలూరిపై నారా లోకేష్ భావోద్వేగ ప్రశంసలు
అమరావతి వర్క్షాపు
ఆంధ్రజ్యోతి, ఒంగోలు
‘గుండె ధైర్యానికితోడు సమయస్ఫూర్తి ఉంటే ఎంతటి క్లిష్టపరిస్థితితినైనా ఎదుర్కోవచ్చు.. అందుకు నాడు అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులు గొట్టిపాటి, స్వామి, ఎమ్మెల్యే ఏలూరి చూపిన తెగువే నిదర్శనం.. అదేనాకు స్ఫూర్తినింపింది.. మీకూ స్ఫూర్తి కావాలి’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లో కేష్ భావోద్వేగ ప్రసంగం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన టీడీపీ బూత్ కమిటీల మేనేజ్మెంట్ వర్క్షాపులో ఆయన పాల్గొన్నారు. ఈ వర్క్షాపునకు ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి పర్చూరు, కనిగిరితోపాటు మరికొన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ లోక్సభ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఆ నియోజకవర్గాల్లోని మండల పార్టీ అధ్యక్షులు బూత్ కమిటీ నిర్వహణపై నియమించిన పర్యవేక్షకులు హాజరయ్యారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల నుంచి వందలాది మంది పాల్గొన్న వర్క్షాపులో మంత్రి లోకేష్ మాట్లాడుతూ కొన్ని సంఘటనలను ఉదహరిస్తూ వారిలో స్ఫూర్తి కలిగించే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా ఏలూరితోపాటు ప్రస్తుత రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి, స్వామిలను కొనియాడుతూ మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మూకుమ్మడిగా మన నాయకుడిపై దాడికి దిగే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఏలూరి సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ.. మమ్మల్ని దాటి ముందుకు కదలండి అంటూ ముందుకొచ్చారు. మరోవైపు స్వామి, గొట్టిపాటి కూడా రంగంలోకి వచ్చారు. వారి సమయస్ఫూర్తి, తెగింపుతో అసెంబ్లీలో ఉన్న మిగిలిన మన సభ్యులు కూడా అప్రమత్తమయ్యారు. లేకుంటే ఆ రోజు మననాయకుడు(చంద్రబాబు)పై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేసి ఉండేవారు. నాయకుడిని, కార్యకర్తను కాపాడుకునేందుకు అలాంటి తెగింపు, సమయస్ఫూర్తిఉండాలని అప్పుడే గుర్తించారు. ఆ సంఘటనే నాకు స్ఫూర్తి అయింది. మీరు కూడా స్ఫూర్తిగా తీసుకుని మీ పరిధిలో కార్యకర్తలకు ఇబ్బందులు ఎదురైనప్పుడు ఐక్యంగా ముందుకునడవాలని హితవుపలికారు. అంతేగాక ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చి వర్క్షాపులో పాల్గొన్న వారికి ‘మీలో మీ ఎమ్యెల్యే ఎంతమందికి తెలుసు, ఎవరెవరు నేరుగా మాట్లాడుతన్నార’ని ఆరాతీశారు. ఆ సందర్భంగా ఏలూరిని పిలిచి ఈయన మీకు తెలుసా, మీలో ఎంతమంది ఆయనతో మాట్లాడారంటూ పర్చూరు నియోజకవర్గంలో బూత్ స్థాయి నుంచి వర్క్షాపునకు వెళ్లిన వారిని ప్రశ్నించారు. వారంతా మాకు తెలుసు మాట్లాడతాం అంటూ చెప్పారు. మిగిలిన నియోజకవర్గాల వారు కూడా మీమీ ఎమ్మెల్యేతో నేరుగా మాట్లాడండి, కార్యకర్తలకు అండగా ఉండండి అని చెప్పారు.