పొగాకుపై అపరాధరుసుంను రద్దు చేయాలి
ABN , Publish Date - Aug 27 , 2026 | 11:35 PM
పొగాకు పంటపై అధికంగా విధించిన అపరాధ రుసుంను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని వేలం కేంద్రాల ప్రతినిధులు కోరారు.
ఎంపీ మాగుంటకు వినతిపత్రం అందించిన రైతు ప్రతినిధులు
ఒంగోలు కలెక్టరేట్,ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి) : పొగాకు పంటపై అధికంగా విధించిన అపరాధ రుసుంను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని వేలం కేంద్రాల ప్రతినిధులు కోరారు. స్థానిక రామనగర్లోని మాగుంట కార్యాలయంలో గురువారం ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. 2025-26 సీజన్లో అధికంగా పండిన పొగాకుపై బోర్డు విధించే అపరాధ రుసుంను రద్దు చేసేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ దృష్టికి పలు సమస్యలను వారు తీసుకెళ్లారు. ఈ ఏడాది సాగు ఖర్చులు పెరగడంతో పాటు ధరలు అంతంత మాత్రంగా ఉన్నాయన్నారు. రెండేళ్లతో పోల్చుకుంటే ధరలు తక్కువగా ఉండటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అనుకూల వాతావరణం వల్ల దిగుబడి వచ్చిందని, దానిపై జరిమానా విధించడం రైతులను మరింత ఇబ్బందులకు గురిచేస్తుందని వివరించారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎంపీని కోరారు. ఆయా అంశాలపై స్పందిచిన ఎంపీ మాగుంట మాట్లాడుతూ అపరాధరుసుం తగ్గింపు విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఇతర ఎంపీలతో కలిసి తీసుకెళ్తానని తెలిపారు. ఎంపీను కలిసిన వారిలో వివిధ వేలం కేంద్రాల ప్రతినిధులు పోతుల నరసింహారావు, అబ్బూరి శేషగిరిరావు, వడ్డెళ్ల ప్రసాద్, గురువారెడ్డి, మురళీ, రామాంజనేయుల, సుబ్బారావు, శివారెడ్డి పాల్గొన్నారు.