ఆర్ఈఎంజడ్ ఏర్పాటుకు తొలి అడుగు
ABN , Publish Date - Aug 06 , 2026 | 03:12 AM
దేశంలోనే మొట్టమొదటగా రెనవబుల్ ఎనర్జీ మ్యానుఫ్యా క్చరింగ్ జోన్ (ఆర్ఈఎంజడ్) ఏర్పాటుకు తొలి అడుగు పడింది. దీంతో అద్దంకి నియోజకవర్గం రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. దీనిపై విద్యుత్శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రత్యేక దృష్టి సారించటంతో పరిశ్రమల ఏర్పాటు లో కీలక భూమిక అయిన భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది.
భూసేకరణ ప్రక్రియ ప్రారంభం
37 మందికి పరిహారం పంపిణీ
పూర్తయితే పారిశ్రామికంగా మరింత అభివృద్ధి
యువతకు ఉద్యోగ అవకాశాలు
అద్దంకి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి) : దేశంలోనే మొట్టమొదటగా రెనవబుల్ ఎనర్జీ మ్యానుఫ్యా క్చరింగ్ జోన్ (ఆర్ఈఎంజడ్) ఏర్పాటుకు తొలి అడుగు పడింది. దీంతో అద్దంకి నియోజకవర్గం రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. దీనిపై విద్యుత్శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రత్యేక దృష్టి సారించటంతో పరిశ్రమల ఏర్పాటు లో కీలక భూమిక అయిన భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత 37 మంది రైతులకు సంబంధించి 175.41 ఎకరాల భూసేకరణ పూర్తిచేసి బుధవారం 31,57,38,000 రూపాయల చెక్కులను అందజేశారు. ఆర్ఈఎంజడ్ ఏర్పా టుకు బల్లికురవ మండలంలోని ఎస్ఎల్.గుడి పాడు, ముక్తేశ్వరం, సంతమాగు లూరు మండలంలోని ఈస్ట్ కుందుర్రు రెవెన్యూ పరిధిలో 1,036.93 ఎకరాల భూమిని గుర్తించారు. ఇందులో 116.85 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా ఇప్పటికే 114 ఎకరాలు నెడ్క్యాప్కు అప్పగించారు. సుమారు 920 ఎకరాల రైతుల పట్టా భూములు ఉన్నాయి. జిల్లా అధికారులు పలు దఫాలు ఆయా గ్రామాల రైతులతో చర్చలు నిర్వహించి ఎకరాకు రూ.18 లక్షల చొప్పున పరిహారం చెల్లించేలా నిర్ణయించారు. ఈ నేపఽథ్యంలో తొలి విడతగా ముక్తేశ్వరానికి చెందిన 8 మంది, ఎస్ఎల్ గుడిపాడుకు చెందిన 13 మంది, ఈస్ట్ కుందుర్రుకు చెందిన 16 మంది రైతులకు పరిహారం అందజేశారు. మిగిలిన రైతులకు కూడా త్వరలో పరిహారం అందజేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆర్ఈఎంజడ్ ఏర్పాటుకు భూసేకరణ జరుగుతుండటంతో త్వరలో తయారీ యూనిట్లు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటి నుంచి స్థానికులకు ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. రాయలసీమ, పశ్చిమ ప్రకాశంలో ఆర్ఈఎంజడ్కు అవకాశాలు మెండుగా ఉన్నప్పటికీ అద్దంకి నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో మంత్రి రవికుమార్ పట్టుబట్టి ఇక్కడ ఏర్పాటు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ రహదారులు అందుబాటులో ఉండటం, రామాయపట్నం ఫోర్ట్ కూడా సమీపంలో ఉండటంతో ఆర్ఈఎంజడ్ ఏర్పాటుకు మార్గం మరింత సుగమమైంది. అద్దంకి నియోజకవర్గంలో ఇప్పటికే ఇటుక, గ్రానైట్ పరిశ్రమలతో గుర్తింపు ఉండగా, ఆర్ఈఎంజడ్ ఏర్పాటుతో దేశంలోనే మరింత గుర్తింపు రానుంది.