సగటు ధర పడిపోయే!
ABN , Publish Date - Aug 13 , 2026 | 02:53 AM
దక్షిణాది పొగాకు మార్కెట్లో ఇప్పటివరకు భారీగా ఉంటున్న నోబిడ్లకు బుధవారం బ్రేక్ పడింది. రోజువారీ కొనుగోలు పరిమాణం కూడా పెరిగింది. ఈ రెండు అంశాలలో గతం కన్నా పరిస్థితి మెరుగైంది.
పొగాకు కనిష్ఠ రేటు తగ్గింపు
ఫలితంగా అధికశాతం కేంద్రాల్లో కిలో రూ.110
తగ్గిన నోబిడ్ బేళ్లు.. 16.33 శాతానికి పరిమితం
రోజువారీ కొనుగోలు మొత్తం పెరుగుదలతో ఊరట
ఒంగోలు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి) : దక్షిణాది పొగాకు మార్కెట్లో ఇప్పటివరకు భారీగా ఉంటున్న నోబిడ్లకు బుధవారం బ్రేక్ పడింది. రోజువారీ కొనుగోలు పరిమాణం కూడా పెరిగింది. ఈ రెండు అంశాలలో గతం కన్నా పరిస్థితి మెరుగైంది. అయితే సగటు ధర మాత్రం దిగజారింది. మార్కెట్లో కనిష్ఠ ధరలను పూర్తిగా తగ్గించ డంతో ఈ పరిస్థితి నెలకొంది. పొగాకు మార్కెట్ను గాడిలో పెట్టేం దుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టిన సమయంలో నోబిడ్లు తగ్గేలా చూడాలన్నది కూడా ప్రధానాంశం. అప్పటివరకు ఉన్న ధరలకు కొనేం దుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో ఆఫ్స్ట్రైల్, లోగ్రేడ్లకు క్వింటాకు వెయ్యి రూపాయలను ప్రభుత్వం బోనస్గా ప్రకటించింది. అదేసమయంలో మార్కెట్లో నాలుగు రకాల గ్రేడ్లకు బేస్ ధరలు నిర్ణయించి అంతకన్నా తక్కువగా కాకుండా కొనాలని, అదేసమయంలో నోబిడ్లను పూర్తిగా తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు, కంపెనీల ప్రతినిధులను ఇటీవల సమీక్షలో మంత్రులు ఆదేశించారు. ఆ ప్రభావం బుధవారం మార్కెట్లో కనిపించింది. నోబిడ్లు గతం కన్నా తగ్గడంతోపాటు రోజువారీ కొనుగోలు పరిమాణం పెరిగింది. ఇప్పటివరకు ఒకట్రెండు రోజులు మినహా మిగతా అన్నిరోజులు దక్షిణాదిలోని వేలం కేంద్రాల్లో సగటున 25 నుంచి 40శాతం వరకు నోబిడ్లు ఉంటున్నాయి. ఎక్కువ రోజులు నిత్యం కొనుగోలు పరిమాణం 0.50 నుంచి 0.65 మిలియన్ కిలోల లోపుగా ఉంటోంది. కాగా బుధవారం మార్కెట్లో నోబిడ్లు 16.33 శాతానికి పరిమితమయ్యాయి. అలాగే సుమారు 0.86 మిలియన్ కిలోల పంట కొనుగోలు చేశారు. రీజియన్లోని మొత్తం 11 కేంద్రాలలో 8,346 బేళ్లు వేలానికి రాగా 6,458 కొనుగోలు చేశారు. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ సగటు ధర దిగజారింది. సగటున కిలోకు రూ.179 మాత్రమే లభించింది. ఇటీవల కాలంలో ఇంత తక్కువగా సగటు ధర లభించడం ఇదే. మంగళవారం నాటి సగటు ధరతో పోల్చితే బుధవారం కిలోకు రూ.4వరకు తగ్గింది. కనిష్ఠ ధరలను తగ్గించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. మార్కెట్లో నాలుగు రకాల గ్రేడ్లకు బేస్ ధరలు నిర్ణయించినప్పుడు లోగ్రేడ్ కనీస ధర కిలో రూ.110గా నిర్ణయించారు. దీంతో బుధవారం అత్యధిక కేంద్రాల్లో కనిష్ఠ ధరను కిలో రూ.110గా పెట్టడం ద్వారా నోబిడ్ల తగ్గింపునకు బోర్డు అధికారులు ప్రయత్నించారు. దీంతో నోబిడ్లు తగ్గినా సగటు ధర దిగజారి ఆమేర రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.