రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి
ABN , Publish Date - Jan 11 , 2026 | 11:40 PM
కారు లారీని ఢీకొట్టిన ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతిచెందాడు. ఈ ఘటన అమరావతి - అనంతపురం జాతీయ రహదారిపై ఎడవల్లి క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది.
లారీని కారు ఢీకొట్టడంతో దుర్ఘటన
రాచర్ల, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : కారు లారీని ఢీకొట్టిన ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతిచెందాడు. ఈ ఘటన అమరావతి - అనంతపురం జాతీయ రహదారిపై ఎడవల్లి క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు... గిద్దలూరు పట్టణానికి చెందిన పరిశపోగు అభిషేక్(29) గిద్దలూరు సెయింట్ పాల్స్ ఎయిడెడ్ పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. పాఠశాల పనుల నిమిత్తం డ్రైవర్ ఇల్లూరి నాగేంద్రతో కలిసి గుంటూరుకు కారులో బయల్దేరారు. నంద్యాల నుంచి నరసరావుపేటకు మొక్కజొన్న విత్తనాల లోడుతో వెళ్తున్న లారీని రంగారెడ్డిపల్లి క్రాస్ రోడ్డు వద్ద అధిగమించబోయి ప్రమాదవశాత్తు కారు డ్రైవర్ వెనుకవైపు నుంచి బలంగా ఢీకొట్టాడు. దీంతో డ్రైవర్ నరేంద్ర, ఉపాధ్యాయుడు అభిషేక్కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు రాచర్ల పోలీసులకు, 108కు సమాచారం అందించారు. స్పందించిన ఎస్సై పి.కోటేశ్వరరావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన ఇద్దరినీ 108లో గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగానే ఉపాధ్యాయుడు అభిషేక్ మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.