ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Mar 04 , 2026 | 12:05 AM
ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో పేదల గృహ నిర్మాణాలకు నిర్దేశించిన లే అవుట్స్లో అర్హులైన లబ్ధిదారులకు వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పీ రాజాబాబు ఆదేశించారు.
కలెక్టర్ రాజాబాబు ఆదేశం
ఒంగోలు కలెక్టరేట్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో పేదల గృహ నిర్మాణాలకు నిర్దేశించిన లే అవుట్స్లో అర్హులైన లబ్ధిదారులకు వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పీ రాజాబాబు ఆదేశించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్లతో కలిసి మునిసిపల్, రెవెన్యూ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేదలకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలన్న లక్ష్యంతో నగర కార్పొరేషన్ పరిధిలో అగ్రహారం, యరజర్ల వద్ద లే అవుట్స్ను వేశామన్నారు. ఈ రెండు లే అవుట్స్లో అర్హులైన లబ్ధిదారులకు వీలైనంత త్వరగా నిర్మాణాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఒంగోలులో నిరుపయోగంగా, ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో పీపీపీ పద్ధతిలో నగర కార్పొరేషన్కు ఆదాయం వచ్చేలా షాపులు, మాల్స్ నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతకు ముందు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ నగరంలో చేపట్టాల్సిన పలు అంశాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో ఆర్డీవో లక్ష్మీప్రసన్న, మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ మదుసూధనరావుతో పాటు సర్వే, రిజస్ట్రేషన్శాఖ అధికారులు పాల్గొన్నారు.