Share News

జిల్లా రూపురేఖలు మారేందుకు సిబ్బంది సేవలే కీలకం

ABN , Publish Date - Jun 30 , 2026 | 10:59 PM

అభివృద్ధి పరంగా జిల్లా రూపురేఖలు మారటంలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది సేవలే అత్యంత కీలకమని కలెక్టర్‌ రాజాబాబు చెప్పారు.

జిల్లా రూపురేఖలు మారేందుకు సిబ్బంది సేవలే కీలకం
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజాబాబు

కలెక్టర్‌ రాజాబాబు

ఒంగోలు కలెక్టరేట్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి) : అభివృద్ధి పరంగా జిల్లా రూపురేఖలు మారటంలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది సేవలే అత్యంత కీలకమని కలెక్టర్‌ రాజాబాబు చెప్పారు. ఆ దిశగా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వివిధ శాఖల్లో మండల స్థాయిలో పనిచేస్తున్న సిబ్బందికి సామర్థ్యం పెంపు కోసం మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ సమావేశపు హాలులో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమంలో భాగంగా కీ పెర్ఫార్మెన్స్‌ ఇండికేటర్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. క్షేత్ర స్థాయిలో గ్రాస్‌వ్యాల్యూ ఎడిషన్‌(జీవీఏ) పెంపు ద్వారా జిల్లా జీడీపీ పెరిగి తలసరి ఆదాయం వృద్ధి చెందుతుందని చెప్పారు. అందుకే క్షేత్ర స్థాయి సిబ్బంది సాధారణ విధులకే పరిమితం కాకుండా తమ పరిధిలోని వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని వివిధ రంగాల్లోని ఉత్పత్తులకు అదనపు విలువ జోడించేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ దిశగా మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వఆలోచనలు, నిబంధనలతో పాటుక్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులను పరిశీలించి మంచి ఫలితాలు సాధించేలా పనిచేయాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీవో సుధాకర్‌రెడ్డి, ఏఎ్‌సవోలు, మండల వ్యవసాయ, ఉద్యాన అధికారులు, డిప్యూటీఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.


బృహత్తర ప్రణాళికను తయారు చేసేందుకు ఏజెన్సీకి అప్పగించాలని నిర్ణయం

ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ మొత్తం విస్తీర్ణానికి బృహత్తర ప్రణాళికా పటం(మాస్టర్‌ ప్లాన్‌)ను తయారు చేసే బాధ్యతను మంచి ఏజెన్సీకి అప్పగించాలని నిర్ణయించారు. స్థానిక కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ సమావేశపు హాలులో మంగళవారం సమావేశం ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ షేక్‌ రియాజ్‌ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో అజెండాలోని 15 అంశాలపై చర్చించారు. ఆయా అంశాలపై కలెక్టర్‌ రాజాబాబు చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. మాస్టర్‌ ప్లాన్‌ తయారు కోసం వెంటనే టెండర్లు పిలవాలని నిర్ణయించారు. మార్కాపురం, కనిగిరి, చీరాల తదితర ప్రాంతాల్లో ఎక్కువుగా ఉన్న అక్రమ లే అవుట్లను తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని, లేకుంటే వాటిని అప్రూవ్‌ లేదా క్రమబద్ధీకరించడం ద్వారా ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థకు సంస్థకు అధిక ఆదాయాన్ని తెచ్చే నియోజకవర్గాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే పాదర్తి సమీపంలో అభివృద్ధి చేయనున్న టూరిజం లే అవుట్‌కు సంబంధించి లాండ్‌ పూలింగ్‌ సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి, జిల్లాపంచాయతీ అధికారి అనుపమ, ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ సెక్రటరీ పద్మావతి, ప్లానింగ్‌ అధికారి మధు పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2026 | 10:59 PM