ఇంతింతై.. టౌనింతై..
ABN , Publish Date - Feb 17 , 2026 | 12:46 AM
జిల్లాకే తల మానికంగా చీరాల నియోజకవర్గం వాణిజ్య, వ్యాపార రంగాలతో పాటు పర్యాటకంలోనూ దినదినాభివృధ్ధి చెందుతోంది.
చీరాల, ఫిబ్రవరి16 (ఆంధ్రజ్యోతి) : జిల్లాకే తల మానికంగా చీరాల నియోజకవర్గం వాణిజ్య, వ్యాపార రంగాలతో పాటు పర్యాటకంలోనూ దినదినాభివృధ్ధి చెందుతోంది. 1948లో మున్సిపాలిటీగా ఏర్పడి చినముంబయిగా మంచిగుర్తింపు పొందింది. ఈ క్రమంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 1.72.826 మంది జనాభా ఉండగా 23070 నివాసాలు ఉన్నాయి. అయితే 2024 లెక్కల ప్రకారం 2,72,422 మంది జనాభా ఉన్నారు. అలాగే నివాసాలు కూడా భారీగానే పెరిగాయి. మొత్తం మున్సిపాలిటీలో 33 వార్డులు ఉండగా, చీరాల మండలం 15 పంచాయతీలు, వేట పాలెం మండలంలో 9 పంచాయతీలు ఉన్నాయి. విద్యాలయాలు, వ్యాపార వాణిజ్య సముదా యాలు, పర్యాటకంతో పాటు అందుబాటులో ఉన్న వనరులతో ఆర్థికంగా దినదినాభివృధ్ధి చెందుతోంది.
పర్యాటకంతో పరవళ్లు
అన్నింటికంటే ముందు పర్యాటకం చీరాలకు కలిసొ చ్చింది. చీరాలకు విజయలక్ష్మీపురం నుంచి పొట్టి సుబ్బయ్యపాలెం వరకు తీరంలో సుమారు 40 వరకు రిసార్ట్స్ వెలిశాయి. నిత్యం ఇక్కడకు వేల సంఖ్యలో పర్యాటకులు విచ్చేస్తున్నారు. దీనికి తోడు తాజాగా ఏర్పాటు చేస్తున్న 167ఏ జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే పర్యాటకం మరింత అభివృద్ధి చెందనుంది. అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో ఉండగానే విద్యారంగానికి సైతం చీరాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే వ్యాపార, వాణిజ్య సముదాయాలు ప్రజలకు అన్ని విధాలుగా అందుబా టులో ఉంటున్నాయి. గతం లో మహానగరాలకే పరిమిత మైన షాపింగ్ మాల్స్ నేడు చీరాలకు క్యూ కడుతున్నా యి. వైద్యరంగం పరంగా కూడా మేటి అన్నచందం గానే పేరు గాంచింది.
విస్తీర్ణం పెరిగితే మరింత మేలు..
ఇదిలా ఉంటే పట్టణ విస్తీర్ణం అతి తక్కువగానే ఉందని చెప్పాలి. ప్రస్తుతం సుమారు 13.57 చదరపు కిలో మీటర్లు మాత్రమే ఉంది. విస్తీర్ణం పెరిగితే మరిన్ని సముదాయాలు ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వాల నుండి నిధులు కూడా అధికంగా రావాల్సి ఉంది. అలాగే చీరాల, పేరాల అనుసంధానంగా ఉన్న రోడ్లు విస్తరించాలి. ఇరుకు సందులు, ట్రాఫిక్ ఇబ్బందులు ప్రజలను అసహనం చెందేలా చేస్తున్నాయి. బేస్తపాలెంతో పాటు రైల్వేస్టేషన్ రోడ్డు - గర్ల్స్ హైస్కూల్ రోడ్డు విస్తరణతో పాటు క్రమబద్ధీకరణ జరగాల్సి ఉంది. అలాగే పరిశ్రమలు మరింత పెరిగి అభివృద్ధికి మరికొన్ని బాటలు పడాల్సి ఉంది. తద్వారా పరిశ్రమలు అందుబాటులోకి వస్తాయి. అప్పుడే ఉపాధి, ఉద్యోగాలు పెరుగుతాయని ప్రజలు భావిస్తున్నారు.