మండిన ఎండ
ABN , Publish Date - May 20 , 2026 | 02:35 AM
భానుడు భగభగ మండిపోయాడు. ఉదయం 7 గంటల నుంచే సుర్రుమనిపించాడు. మధ్యాహ్నానికి సెగలు కక్కాడు. దీంతో ప్రజలు తల్లడిల్లిపోయారు. బుధ, గురువారాల్లో 45నుంచి 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
సంతనూతలపాడులో అత్యధికంగా 44.1 డిగ్రీలు
నేడు, రేపు మరింత అధిక ఉష్ణోగ్రతలు
మూడు మండలాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్
ఒంగోలు కలెక్టరేట్, మే 19 (ఆంధ్రజ్యోతి) : భానుడు భగభగ మండిపోయాడు. ఉదయం 7 గంటల నుంచే సుర్రుమనిపించాడు. మధ్యాహ్నానికి సెగలు కక్కాడు. దీంతో ప్రజలు తల్లడిల్లిపోయారు. బుధ, గురువారాల్లో 45నుంచి 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బల్లికురవ, సంతమాగులూరు, కందుకూరు లకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జిల్లాలో మొత్తం 28 మండలాలు ఉండగా 24 చోట్ల మంగళవారం గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. అత్యధికంగా సంతనూతలపాడులో 44.1 డిగ్రీల ఎండ కాచింది. బల్లికురవ మండలంలో 43.5, అద్దంకిలో 43.3, కందుకూరులో 43.2, పొన్నలూరులో 43.2, చీమకుర్తిలో 42.8, ఒంగోలు రూరల్లో 42.7, కొండపిలో 43.1 డిగ్రీలు నమోదైంది. టంగుటూరు మండలంలో 42.3, తాళ్లూరులో 42.1, మర్రిపూడిలో 42.2, ముండ్లమూరులో 42.1, మద్దిపాడులో 42.1, లింగసముద్రంలో 42.3, జె.పంగులూరులో 42.4, వలేటివారిపాలెంలో 41.7, దర్శిలో 41.8, దొనకొండలో 41.9 డిగ్రీల ఎండకాచింది. జిల్లాకేంద్రమైన ఒంగోలులో ఒక్కరోజులోనే మూడు డిగ్రీలు పెరిగింది. ఉదయం 9 గంటల నుంచే నగరంలోని ప్రధాన రహదారుల్లో జనసంచారం తగ్గిపోయింది. క్రమంగా నిర్మానుష్యంగా మారాయి. మధ్యాహ్నం 12గంటల సమయంలో కలెక్టరేట్ ప్రాంతంలో కర్ప్యూ వాతావరణం కనిపించింది. హైవేపై ఎండమావులు దర్శనమిచ్చాయి.