సోలార్ యూనిట్లతో విద్యుత్ ఆదా
ABN , Publish Date - Jun 07 , 2026 | 02:40 AM
సోలార్ యూనిట్ల ఏర్పాటుతో కరెంటు ఆదా అవుతుందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు.
సూర్యఘర్ను వినియోగించుకోండి
మంత్రి గొట్టిపాటి రవికుమార్
పంగులూరు, జూన్ 6 (ఆంధ్రజ్యోతి) : సోలార్ యూనిట్ల ఏర్పాటుతో కరెంటు ఆదా అవుతుందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. మండలంలోని ఆరికట్లవారిపాలెం గ్రామంలో శనివారం సూర్యఘర్ పథకంతోపాటు చందలూరు నుంచి గంగవరం వరకు రూ.2 కోట్ల ఉపాధి నిధులతో పునర్నిర్మించిన బీటీ రోడ్డును ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడు తూ.. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు నూరుశాతం సబ్సిడీతో రూఫ్టాప్ సోలార్ యూనిట్లు ఏర్పాటుచేస్తున్నదన్నారు. బీసీ, ఓసీ వినియోగదారులు కూడా సబ్సిడీ పొందే అవకాశం ఉందన్నారు. పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని ప్రజాప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. సూర్యఘర్ యూనిట్ల ఏర్పాట్లలో కాంట్రాక్టర్లు తగిన నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు.
తెల్లజొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి
చందలూరులో తెల్లజొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేసి ప్రభుత్వమద్దతు ధరకు కొనుగోలు చేయాలని గ్రామ రైతులు అడ్డగడ సతీష్, పెంట్యాల వెంకటేశ్వర్లు మంత్రి గొట్టిపాటికి విజ్ఙప్తి చేశారు. గ్రామ ప్రజల తాగునీటి అవసరాల కోసం మంచినీటి బోర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాసులును మంత్రి ఆదేశించారు. సమస్యలపై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో ఈఈ మస్తాన్రావు, తహసీల్దార్ సింగారావు, ఏఈ. హనుమంతరావు, టీడీపీ నాయకులు కేవీ సుబ్బారావు, రావూరి రమేష్, మాగులూరి రమేష్, ఉన్నం రవిబాబు, వీరాంజనేయులు, అల్లంనేని బ్రహ్మానందస్వామి, బెల్లంకొండ శ్రీధర్, రావూరి సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.