సంజీవనిలా గిద్దలూరు డయాలసిస్ సెంటర్
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:29 AM
గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్ సెంటర్ రోగుల పాలిట సంజీవినిలా మారింది. ప్రైవేటు, కార్పొరేట్ వైద్యశాలలకు దీటుగా డయాలసిస్ సెంటర్ నిర్వహణ ఉండడంతో స్థానిక రోగులే కాకుండా దూరప్రాంతాలు, పక్కజిల్లాల రోగులు సైతం ఇక్కడకు వచ్చి రక్తాన్ని శుద్ధి చేసుకుని క్షేమంగా ఇంటికి వెళుతున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో రోజూ 17 మందికి రక్తమార్పిడి
ఎమ్మెల్యే అశోక్రెడ్డి చొరవతో వినియోగంలోకి
మార్కాపురంతోపాటు కడప జిల్లా నుంచి కూడా బాధితులు రాక
గిద్దలూరు, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి) : గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్ సెంటర్ రోగుల పాలిట సంజీవినిలా మారింది. ప్రైవేటు, కార్పొరేట్ వైద్యశాలలకు దీటుగా డయాలసిస్ సెంటర్ నిర్వహణ ఉండడంతో స్థానిక రోగులే కాకుండా దూరప్రాంతాలు, పక్కజిల్లాల రోగులు సైతం ఇక్కడకు వచ్చి రక్తాన్ని శుద్ధి చేసుకుని క్షేమంగా ఇంటికి వెళుతున్నారు. గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్పై ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి ప్రత్యేక దృష్టిపెట్టి వినియోగంలోకి తెచ్చారు. ఆ తరువాత కూడా మౌలిక సదుపాయాల ఏర్పాటు, సిబ్బంది కేటాయింపుపై ఎమ్మెల్యే అశోక్రెడ్డి ప్రత్యేక చొరవ చూపి తరచూ పర్యవేక్షిస్తున్నారు. దీంతో రోగుల రాక పెరిగింది. దీనికితోడు డాక్టర్లు, సిబ్బంది సైతం నిబద్దతతో విధులు నిర్వహిస్తున్నారు.
36 మంది రోగులు
గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్ సెంటర్లో ప్రస్తుతం 36 మంది రోగులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. రోజుకు సగటున 17 మంది వస్తున్నారు. మొత్తం 7 డయాలసిస్ బెడ్లు ఉండగా ఇందులో 6 బెడ్లు నెగటివ్, ఒక బెడ్ పాజిటివ్ హెచ్ిసీవి అని డయాలసిస్ సెంటర్ ప్రతినిధులు విజయ్, శ్రీనివాసులు తెలిపారు. గత ఆగస్టు నుంచి ఇప్పటివరకు 4300 పర్యాయాలు రోగులకు డయాలసిస్ చేసినట్లు చెప్పారు.
పక్క జిల్లాల రోగులు
గిద్దలూరు డయాలసిస్ సెంటర్కు నియోజకవర్గంలోని రోగులే కాకుండా కడప జిల్లాలోని రామాపురం, కలసపాడు, మార్కాపురం ప్రాంతంలోని తిప్పాయిపాలెం నుంచి కూడా డయాలసిస్ చేయించుకునేందుకు వస్తుండడం విశేషం. ఈ సెంటర్ లేని రోజుల్లో ఇక్కడి రోగులు నంద్యాల పట్టణంలో ప్రైవేటు డయాలసిస్ సెంటర్లకు వెళ్లి ఒక్కొక్క సిట్టింగ్కు 3500 రూపాయల చొప్పున చెల్లించేవారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగానే ఈ సదుపాయాన్ని పొందుతున్నారు.
ప్రత్యేక జనరేటర్ కోసం వినతి
విద్యుత్ పోయిన సందర్భాలలో 10 నిమిషాల వ్యవధిలోనే బ్యాటరీలు డౌన్ అయి రోగులకు డయాలసిస్ ప్రక్రియ ఆగిపోతుంది. ఈలోగా ప్రభుత్వ ఆసుపత్రికి మొత్తానికి ఉన్న జనరేటర్ను ఆన్చేయకపోతే చికిత్స మధ్యలో ఉన్న రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. డయాలసిస్ సెంటర్కు ప్రత్యేకంగా ఆటోమేటిక్ సదుపాయం కలిగిన జనరేటర్ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని రోగులు కోరుతున్నారు.
కొత్తగా 2 మిషన్లు
గిద్దలూరు డయాలసిస్ సెంటర్లో మొత్తం 7 బెడ్లు ఉన్నప్పటికీ 5 డయాలసిస్ మిషన్లు మాత్రమే ఉన్నాయి. ఎమ్మెల్యే అశోక్రెడ్డి ప్రత్యేకంగా కృషి చేసి కొత్తగా 2 మిషన్లను కూడా అందుబాటులోకి తేవడంతో గురువారం నుంచి మొత్తం 7 బెడ్లపై ఏడుగురు రోగులు ఒకే పర్యాయం డయాలసిస్ చేసుకునే అవకాశం ఏర్పడింది. సిబ్బంది కొరత గాని, మందుల కొరత గాని లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా గిద్దలూరు డయాలసిస్ సెంటర్పై ఆధారపడుతూ ప్రభుత్వ సదుపాయాన్ని మెచ్చుకుంటున్నారు.