హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం.. టీడీపీ నేత కేశవులు మృతి
ABN , Publish Date - Jan 08 , 2026 | 10:58 PM
హైదరాబాదులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పీసీపల్లి మండల టీడీపీ సీనియర్ నాయకుడు వీరపనేని కేశవులు(52) మృతి చెందాడు.
పీసీపల్లి, జనవరి 8(ఆంధ్రజ్యోతి) : హైదరాబాదులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పీసీపల్లి మండల టీడీపీ సీనియర్ నాయకుడు వీరపనేని కేశవులు(52) మృతి చెందాడు. ఈ ప్రమాదం గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ సమీపంలో చోటుచేసుకుంది. మృతుడి బంధువులు, స్నేహితులు తెలిపిన వివరాల మేరకు... పీసీపల్లి మండలం చినవరిమడుగు గ్రామానికి చెందిన వీరపనేని కేశవులు ఎన్నోఏళ్లుగా టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు. హైదరాబాదులోని నానక్రామ్గూడ ప్రాంతంలో హోటల్, పీజీలు నిర్వహిస్తున్నాడు. గురువారం తన భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. విప్రో సర్కిల్ సమీపంలోకి వచ్చే సరికి నీళ్లట్యాంకర్ తగలడంతో రోడ్డుపై పడిపోయారు. వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ వైద్యశాలకు తరలించగా అప్పటికే కేశవులు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.మృతుడికి భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కేశవులు కుటుంబసభ్యులకు ఫోన్ చేసి సంతాపం తెలియజేస్తూ సానుభూతిని వ్యక్తపరిచారు.