పాఠశాల విద్యలో విప్లవాత్మక మార్పులు
ABN , Publish Date - Jul 22 , 2026 | 01:15 AM
పాఠశాల విద్యలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సర్కారు స్కూళ్లలోని విద్యార్థులకు అత్యాధునిక బోధన పద్ధతుల ద్వారా జాతీయస్థాయి విద్యా ప్రమాణాల అమలుకు సంకల్పించింది.
జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలే లక్ష్యం
నియోజకవర్గానికి ఒక లీప్ స్కూల్ ఏర్పాటు
ఒంగోలు విద్య, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : పాఠశాల విద్యలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సర్కారు స్కూళ్లలోని విద్యార్థులకు అత్యాధునిక బోధన పద్ధతుల ద్వారా జాతీయస్థాయి విద్యా ప్రమాణాల అమలుకు సంకల్పించింది. అందుకోసం ప్రయోగాత్మకంగా అన్ని ఆధునిక హంగులతో మంగళగిరిలో ఏర్పాటు చేసిన లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ (లీప్) పాఠశాల విజయవంతం కావడంతో ఆ తరహా లోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పది లీప్ పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపు, మౌలిక వసతులు, సాంకేతికత ఆధార బోధన, నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు.
ఎంపికైన పాఠశాలలు ఇవే..
ప్రకాశం జిల్లాలోని ఒంగోలు డీఆర్ఎం హైస్కూలు, సంతనూతలపాడు జడ్పీ హైస్కూలు, కొండపి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మేదరమెట్ల జడ్పీ హైస్కూలు, దొనకొండ హైస్కూలు, కందుకూరు జడ్పీ బాలుర హైస్కూళ్లను లీప్ పాఠశాలలుగా ఎంపిక చేశారు. మార్కాపురం జిల్లాలో బేస్తవారపేట జడ్పీ బాలుర హైస్కూలు, మార్కాపురం జడ్పీ హైస్కూలు, పెద్దదోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కంచర్లవారిపల్లి జడ్పీ హైస్కూలును ఎంపిక చేశారు. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు అత్యాధునిక విద్యాబోధన అందించనున్నారు. డిజిటల్ బోధన పరికరాలు, ఆధునిక సైన్స్ కంప్యూటర్ ల్యాబ్లు, గ్రంథాలయాలు అభివృద్ధి చేయనున్నారు. పాఠశాలలకు అవసరమైన పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టితో బోధనతో రానున్న రోజుల్లో ఈ పాఠశాలలు ఆదర్శంగా నిలవనున్నాయి.