Share News

నిషేధం మాయ

ABN , Publish Date - Jan 27 , 2026 | 02:39 AM

అద్దంకి పట్ట ణంలోని పలుప్రాంతాలు నిషేధిత భూముల జాబితాలో ఉండటంతో రిజిస్ర్టేషన్‌లు జరగక క్రయవిక్రయాలు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి కూడా గండిపడుతోంది. ప్రధానంగా ఉత్తర అద్దంకి రెవెన్యూ పరిధిలో ఉన్న 1038 సర్వే నెంబర్‌లో సుమారు 70 ఎకరాల భూమి దేవదాయశాఖకు చెందిన దిగా నమోదైంది.

నిషేధం మాయ
అద్దంకి పట్టణం వ్యూ

దేవదాయ భూముల పేరుతో పట్టణంలో రిజిస్ర్టేషన్లు నిలిపివేత

అద్దంకిలో కుదరదని చెబుతున్నా... ఎనీవేర్‌లో జరుగుతున్న వైనం

అయోమయంలో క్రయ, విక్రయదారులు

ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

అద్దంకి, జనవరి 26 (ఆంద్రజ్యోతి): అద్దంకి పట్ట ణంలోని పలుప్రాంతాలు నిషేధిత భూముల జాబితాలో ఉండటంతో రిజిస్ర్టేషన్‌లు జరగక క్రయవిక్రయాలు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి కూడా గండిపడుతోంది. ప్రధానంగా ఉత్తర అద్దంకి రెవెన్యూ పరిధిలో ఉన్న 1038 సర్వే నెంబర్‌లో సుమారు 70 ఎకరాల భూమి దేవదాయశాఖకు చెందిన దిగా నమోదైంది. వాస్తవంగా ఆ సర్వే నెంబర్‌లో ఆరు ఎకరాల విస్తీర్ణంలో వేర్వేరు చోట్ల దేవాలయాలు ఉన్నా యి. ఆ సర్వే నెంబర్‌లోని మొత్తం విస్తీర్ణంలో రిజిస్ర్టేష న్‌లు నిలిచిపోయాయి. అదేసమయంలో ఉత్తర అద్దం కిలోని సర్వే నెంబర్‌ 1096లో ధర్మతోపుగా నమోదై ఉండటంతో ఆ ప్రాంతంలో ఉన్న స్థలాలు రిజిస్ర్టేషన్‌లు ఆగిపోయాయి. అయితే, అత్యవసరమై స్థలాలు అమ్ముకునే పరిస్థితులలో వేరే సర్వే నెంబర్‌ పేరుతో హద్దులు మాత్రం ప్రస్తుతం కొనుగోలు చేసే స్థలానికి చెందినవే ఉదహరిస్తూ రిజిస్ర్టేషన్‌లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి రిజిస్ర్టేషన్ల ద్వారా వచ్చే ఆదాయానికి గండిపడుతుంది. 2011 సంవత్సరం నుండి గ్రామకంఠం భూమిగా ఉంటే రిజిస్ర్టేషన్‌లు యథావిధిగా జరిగాయి. అయితే, సమాచార హక్కు చట్టం ద్వారా ఎవరో సమాచారం అడిగారని సాకుచూపి 1038 సర్వే నెంబర్‌ భూమిలో గత ఎనిమిది నెలలుగా రిజిస్ర్టేషన్‌లు నిలిచిపోయాయి. 1096 సర్వే నెంబర్‌ ధర్మతోపుగా ఉండటంతో దశాబ్దాల నుంచి రిజిస్ర్టేషన్‌లు నిలిచిపోయాయి. రెండు సర్వే నెంబర్‌ల పరిధిలో సుమారు 140 ఎకరాలకుపైగా ఉంది. అదేసమయంలో అద్దంకి పట్టణంలోని నడిబొడ్డున ఉన్న ప్రాంతాలు కావటంతో స్థలాలకు అత్యంత విలువ ఉంది. ప్రధానంగా కాకానిపాలెం, భవానిసెంటర్‌, పోతురాజుగండి, దర్శి రోడ్డు ప్రాంతాలు 1038 సర్వే నెంబర్‌లో ఉన్నాయి. మున్సిపల్‌ కార్యాలయం, ఆర్‌అండ్‌బీ బంగ్లా, పోలీస్‌స్టేషన్‌ తదితర ప్రాంతాలన్నీ 1096 సర్వే నెంబర్‌లో ఉన్నాయి. ప్రతిఏటా కోట్ల రూపాయలలో స్థలాలు అమ్మకాలు, కొనుగోలు జరుగుతున్నాయి. అవన్నీ అనధికారికంగా లేక వేరే సర్వే నెంబర్‌తో రిజిస్ర్టేషన్లు జరుగుతున్నట్లు సమచారం. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు స్థానికులు పలుమార్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. దీంతో చీరాల ఆర్‌డీవో దేవాదాయశాఖ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. ఉన్నతాఽధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం అద్దంకి నియోజకవర్గం ప్రకాశం జిల్లా పరిధిలోకి చేరటంతో సమస్య మళ్ళీ మొదటికే వస్తుందనే అనుమానం ప్రజలలో నెలకొంది. 1038 సర్వే నెంబర్‌ విషయానికి వస్తే ఎడెనిమిది నెలల క్రితం వరకు యథావిఽధిగా రిజిస్ర్టేషన్లు జరగటంతో తహసీల్దార్‌ శ్రీచరణ్‌ స్థానికంగా పరిశీలన చేసి దేవాలయాల భూమిని విభజించి మిగిలిన భూమికి నోఅబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ను ఇచ్చారు. రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మాత్రం రిజిస్ర్టేషన్‌లు జరగటం లేదు.

ఎనీవేర్‌ కింద వేరే సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలలో ఓకే..

ఉత్తర అద్దంకి రెవెన్యూ పరిధిలోని 1038 సర్వే నెంబర్‌లో ఉన్న స్థలాలను అద్దంకి సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో రిజిస్ర్టేషన్‌లు చేయటం లేదు. వేరే ప్రాంతంలో ఉన్న కార్యాలయాల్లో మాత్రం ఎనీవేర్‌ ద్వారా రిజిస్ర్టేషన్‌లు జరుగుతున్నాయి. సదరు రిజిస్ర్టేషన్‌కు అద్దంకి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం నుంచి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండా అంగీకరించటం పలువురిని విస్మయానికి గురిచేస్తుంది. దీంతో క్రయ, విక్రయదారులు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పరిశీలన చేసి క్రయ, విక్రయాలకు అనుమతిస్తే ప్రభుత్వ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Jan 27 , 2026 | 02:39 AM